Share News

Pakistan Saudi Arabia: మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:47 AM

నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట..

Pakistan Saudi Arabia: మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టే

పాక్‌-సౌదీ మధ్య ‘నాటో’ తరహా రక్షణ ఒప్పందం

ఖతార్‌లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో

‘ఇస్లామిక్‌ నాటో’ ఏర్పాటుకు పలు దేశాల ఒత్తిడి

ఆ భేటీ జరిగిన 2 రోజులకే పాక్‌-సౌదీ ఒప్పందం

మన దేశంపై కలిగేప్రభావాలను పరిశీలిస్తున్నాం: భారత్‌

ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే.. కాంగ్రెస్‌ విమర్శలు

  • పాక్‌-సౌదీ మధ్య ‘నాటో’ తరహా రక్షణ ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట.. అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌- సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం.. ఆ రెండు దేశా ల్లో ఏ దేశంపై ఇతర దేశాలు దాడికి దిగినా రెండూ కలిసి యుద్ధం చేస్తాయి. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ రియాద్‌ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. షెహబాజ్‌ షరీఫ్‌- సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ దీనిపై సంతకం చేశారు. ఆ సమయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిఫ్‌ మునీర్‌, పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్‌, రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ అక్కడే ఉన్నారు. అనంతరం ఇరుదేశాలూ కలిసి దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించడం, తమ రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఈ ఒప్పందం ఉద్దేశమని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. కాగా.. పాక్‌-సౌదీ నడుమ ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న చర్చల ఫలితమే ఈ ఒప్పందం అని సౌదీ అరేబియాకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం.. ఇటీవలికాలంలో జరిగిన ఎలాంటి ఘర్షణకూ ప్రతిస్పందన కాదని ఆయన పేర్కొన్నారు.


పరిశీలిస్తున్నాం..

పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా చిరకాలంగా కొనసాగుతున్న రక్షణ సహకారాన్ని అధికారికం చేసే ఒప్పందం ఒకటి పరిశీలనలో ఉందన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం వల్ల కలిగే వ్యూహాత్మక, భద్రతా ప్రభావాలను భారత ప్రభుత్వం సమీక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్‌తో ఈ ఒప్పందం కుదిరినప్పటికీ.. న్యూఢిల్లీతో తమ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని సౌదీ సీనియర్‌ అధికారి ఒకరు పునరుద్ఘాటించారు. కాగా, ఈ ఒప్పందం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించింది. ‘‘ఇది మన దేశ భద్రతకు ఆందోళన కలిగించే విషయం. ప్రధాని మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకునే వ్యక్తిత్వ ఆధారిత దౌత్యానికి ఇది మరో ఎదురుదెబ్బగా కాంగ్రెస్‌ భావిస్తోంది’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో విమర్శించారు.

‘ఇస్లామిక్‌ నాటో’కు బీజం?

ఖతార్‌ రాజధాని దోహాలోని హమాస్‌ నేతలే లక్ష్యంగా ఈ నెల 9న ఇజ్రాయెల్‌ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో.. అరబ్‌లీగ్‌, ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కో-ఆపరేషన్‌(ఓఐసీ)లో సభ్యత్వం ఉన్న దాదాపు 40 దేశాల అధినేతలు సెప్టెంబరు 15న ఖతార్‌ నిర్వహించిన అత్యవసర సమావేశానికి హాజరయ్యారు. ఆ భేటీలో ఈజిప్టు, ఇరాన్‌, ఇరాక్‌, పాకిస్థాన్‌ తదితర దేశాలు ‘అరబ్‌ నాటో’ ఏర్పాటుకు ఒత్తిడి చేశాయి. ఆ భేటీ అయిన కొద్దిరోజులకే పాక్‌-సౌదీ నడుమ ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఊహించండి.. పాక్‌ తన కు టిల బుద్ధితో భారత్‌పై నేరుగా దాడికి పాల్పడకుం డా ఉగ్రవాదుల ద్వారా దాడులు చేయిస్తే.. దానికి ప్రతిగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తరహా చర్య చేపట్టినప్పుడు.. పాక్‌కు మద్దతుగా సౌదీ రంగంలోకి దిగితే? తన వద్ద ఉన్న ఎఫ్‌-15 యుద్ధవిమానాలు, యూరోఫైటర్‌ టైఫూన్లను పాక్‌కు సాయంగా పంపి స్తే? ఈ ఒప్పందంవల్ల అలా జరిగేప్రమాదం ఉంది. అయితే.. పాక్‌ దృష్టి భారత్‌పై ఉండొచ్చుగానీ.. సౌదీ అసలు లక్ష్యం ఇజ్రాయెల్‌ అని రక్షణరంగ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 06:48 AM