Pakistan Internal Issues: పాక్లో గుబులు
ABN , Publish Date - May 02 , 2025 | 04:55 AM
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ అంతర్గత సమస్యలతో ఇబ్బందుల్లో పడింది. భారత్తో ప్రత్యక్షంగా యుద్ధం తప్పకపోతే అనుకుంటున్న పాక్ బంగ్లాదేశ్ను పావుగా వాడి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అదృశ్యమయ్యారని ప్రచారం జరుగుతోంది, పాక్ నావికాదళం బలహీనంగా మారింది.
ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న దాయాది దేశం
భారత్తో పోరు తప్పదేమోనని ఆందోళన
బంగ్లాను వాడుకుని భారత్పై ఒత్తిడికి ప్లాన్
అందుకే భారత్-బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం, ఐఎ్సఐ కదలికలు!
అటు ఎల్వోసీ వెంట నిఘా రాడార్లు, ఎలకా్ట్రనిక్ వార్ఫేర్ వ్యవస్థల మోహరింపు
పాక్ ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్ల గగనతలంపై నెల రోజులపాటు ఆంక్షలు
పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అదృశ్యం
దేశం వదిలి పారిపోయారనే ప్రచారం
న్యూఢిల్లీ, మే 1: అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్.. పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతర పరిణామాలతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఓవైపు అఫ్ఘానిస్థాన్, బలూచిస్థాన్, ఇరాన్లతో ఉద్రిక్త పరిస్థితులు, పాక్ ఆర్మీ చీఫ్ అదృశ్యమయ్యారనే ప్రచారం, సైన్యం, నేవీ యుద్ధానికి సిద్ధంగా లేవనే అంచనాలు.. మరోవైపు భారత్తో యుద్ధం తప్పదేమోననే యోచనతో ఆ దేశ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్లో పాక్ సైనికాధికారులు, పాక్ నిఘా సంస్థ ఐఎ్సఐ కదలికలు ఉన్నాయని బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ను నేరుగా ఎదుర్కోలేని పాక్.. బంగ్లాదేశ్ను పావుగా వాడుకుని భారత్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేస్తోందని రక్షణ నిపుణులు, విశ్రాంత సైనికాధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్లో పాక్ సైన్యం, ఐఎ్సఐ ఏజెంట్ల కదలికలు
భారత్-పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పాక్ సైన్యం అధికారులు, ఆ దేశ నిఘా సంస్థ ఐఎ్సఐ ఏజెంట్ల కదలికలు బయటపడ్డాయి. దీనితో భారత ప్రభుత్వం బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇది బంగ్లాదేశ్ వేదికగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు పాక్ వేస్తున్న ఎత్తుగడ అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి పాకిస్థాన్కు నలువైపులా చిక్కులే. అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్ల పాలన తిరిగి మొదలైన తర్వాత రెండు దేశాలకూ పడటం లేదు. అఫ్ఘాన్ వేదికగా పనిచేస్తున్న తెహ్రీకీ తాలిబాన్ పాకిస్థాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు తరచూ పాక్లో దాడులు చేస్తున్నాయి. ఇక బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఇటీవలి కాలంలో తరచూ పాక్ సైన్యంపై దాడులు చేస్తుండటం తలనొప్పిగా మారింది. ఇరాన్ను అడ్డాగా చేసుకున్న జైష్ అల్ అదిల్ వంటి ఉగ్రవాద సంస్థలు పాక్పై.. పాకిస్థాన్లోని కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇరాన్పై దాడులు చేస్తున్నాయి. దీనితో పాక్, ఇరాన్ రెండు దేశాలు కూడా పరస్పరం సరిహద్దులు దాటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితిలో భారత్ చర్యలతో పాక్ ఆందోళనలో పడిందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవలి తిరుగుబాటు అనంతరం.. పాక్ అనుకూల మతవాద శక్తులు బలపడ్డాయని.. వాటిని పావుగా వాడుకుని భారత్ను ఇబ్బంది పెట్టాలన్నది పాక్ వ్యూహమని అంటున్నారు.
ఆర్మీ చీఫ్ మాయం వెనుక...
ఉగ్రవాదులను రెచ్చగొట్టి పహల్గాం ఘటనకు మూల కారకుడిగా ప్రచారం జరిగిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్.. అదృశ్యమయ్యాడనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లిపోయారని.. లేదా రావల్ఫిండిలోని ఓ బంకర్లో దాక్కున్నారని ప్రచారం జరుగుతోంది. పాక్ ప్రభుత్వం దీనిపై పూర్తి స్పష్టత ఇవ్వకుండా.. ప్రధాని షెహబాజ్తో ఆసిమ్ మునీర్ కలసి ఉన్న ఓ ఫొటోను విడుదల చేసింది. తాజాగా గురువారం కూడా.. ‘భారత్ ఎలాంటి మిలటరీ చర్యలు చేపట్టినా.. తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తాం..’ అంటూ ఆసిమ్ మునీర్ భారత్ను హెచ్చరించినట్టుగా ప్రకటన విడుదల చేసింది. కానీ ఆసిమ్ మునీర్ నేరుగా మీడియా ముందుకు మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఇక పాక్ ప్రజల్లో పలుకుబడి ఉన్న ఇమ్రాన్ఖాన్ను పదవీచ్యుతుడిని చేసి, జైలుపాలు చేయడం వెనుక ఆర్మీ హస్తంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ క్రమంలో ఆసిమ్ మునీరే ప్రణాళిక రచించారని.. భారత ఆర్మీ దాడికి దిగితే, పాక్ సైన్యానికి ప్రజల మద్దతు లభిస్తుందని, సైన్యంపై పట్టు పెంచుకోవచ్చని భావించారని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. ‘ది సండే గార్డియన్’ ఆంగ్ల పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. కానీ భారత ప్రతిస్పందన తీవ్రంగా ఉండటంతో.. ఆసిమ్ మునీర్ పట్ల పాక్ పాలకులు, ఆర్మీ అధికారుల్లోనే వ్యతిరేకత నెలకొందని, ఆయన అదృశ్యం వెనుక ఇదే కారణమై ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఆర్మీ చీఫ్ అదృశ్యం, భారత్ దాడి భయంతో.. పాక్ ఆర్మీలో వివిధ ర్యాంకుల అధికారులు రాజీనామాలు చేస్తున్నారని, ఈ అంశం పాకిస్థాన్ పాలకుల్లో గుబులు రేపుతోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఆసిమ్ మునీర్ అదృశ్యం వెనుక భారత్పై ఒత్తిడి పెంచే ప్రత్యేక వ్యూహమేదైనా ఉండొచ్చని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాన నగరాల గగనతలంపై ఆంక్షలు
పాక్లోని ప్రధాన నగరాలు కరాచీ, లాహోర్ల గగనతలంపై ఆ దేశం ఆంక్షలు విధించింది. మే నెల మొత్తం రోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 వరకు ఎలాంటి ఎయిర్ ట్రాఫిక్ ఉండకుండా నిషేధం విధించింది. ఆ సమయాల్లో ప్రయాణించే పౌర విమానాలను ఇతర మార్గాల ద్వారా మళ్లించనున్నట్టు తెలిపింది. ఇక ఆ దేశానికి చెందిన అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ నెల రోజులు హైఅలర్ట్ ప్రకటించింది.
బలహీనంగా పాక్ నేవీ..!
ప్రస్తుతం పాక్ నావికాదళం బాగా బలహీనంగా ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పాక్ నేవీలో ఎనిమిది జలంతర్గాములు ఉన్నాయి. అందులో పీఎన్ఎ్స హశ్మత్, పీఎన్ఎ్స హర్మత్, పీఎన్ఎ్స హమ్జా ప్రస్తుతం పనిచేసే స్థితిలో లేవు. రెండు అగోస్టా-70, మూడు అగోస్టా 90బీ తరహా జలంతర్గాములు మాత్రమే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇందులో ఒక అగోస్టా-70, ఒక అగోస్టా 90బీ జలంతర్గాములు.. మరమ్మతుల కోసం కరాచీ నేవీ బేస్లో ఉన్నట్టు ఇటీవల ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. మరో అగొస్టా-90బి జలంతర్గామి కరాచీ షిప్యార్డ్ ఇంజనీరింగ్ వర్క్స్లో పూర్తిగా నేలమీదకు తెచ్చి పెట్టి ఉంది. అంటే దానికి భారీ స్థాయిలో మరమ్మతులు, ఆధునికీకరణ అవసరం. అంటే ప్రస్తుతం పాక్ వద్ద ఒక అగోస్టా-70, ఒక అగోస్టా 90బీ జలంతర్గాములు మాత్రమే పనిచేసే స్థితిలో ఉన్నాయి. భారత రిటైర్డ్ మేజర్ జనరల్ గగన్ దీప్ బక్షి ఇటీవల ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు. కాగా, భారత్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురవుతుందో అనే ఆందోళనలో ఉన్న పాకిస్థాన్ దాదాపు మూడేళ్లుగా ఖాళీగా ఉన్న జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎ్సఏ) పోస్టును భర్తీ చేసింది. ప్రస్తుత ఐఎ్సఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్ను పాక్ జాతీయ భద్రత సలహాదారు(ఎన్ఎ్సఏ)గా నియమించింది.
‘ఎలకా్ట్రనిక్ వార్’కూ సిద్ధం
భారత్ ఏక్షణమైనా దాడి చేయవచ్చనే ఆందోళనతో పాకిస్థాన్ తన రాడార్ నిఘా వ్యవస్థలు, సిగ్నల్ జామర్లతో కూడిన ఎలకా్ట్రనిక్ వార్ఫేర్ వ్యవస్థలను నియంత్రణ రేఖ సమీపంలోకి తరలిస్తోంది. అందులో చైనా తయారీ టీపీఎస్-77 రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. అవి సుమారు 463 కిలోమీటర్ల దూరం, 30.5 కిలోమీటర్ల ఎత్తు వరకు గగనతలంపై నిఘా పెట్టగలవని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే చైనా తయారీ డీడబ్ల్యూఎల్-002 ఎలకా్ట్రనిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థ.. శత్రుదేశాల రాడార్లు, జీఎన్ఎ్సఎ్స (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) సిగ్నళ్లను జామ్ చేయగలదని వివరిస్తున్నారు. కానీ.. మన దేశం వద్ద అంతకన్నా అత్యాధునిక సంయుక్త, హిమశక్తి వంటి వ్యవస్థలు ఉన్నట్టు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News