Share News

Pakistan: పాక్‌కు ఏడీబీ 800 మిలియన్ డాలర్ల సాయం.. భారత్ తీవ్ర అభ్యంతరం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:32 PM

పాక్‌కు ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని ఫిలిప్పీన్‌లోని ఏడీబీ సైతం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. 'ఇంప్రూవ్డ్ రిసోర్సె్ మొబిలైజేషన్ అండ్ యుటిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రాం'లోని సబ్ ప్రోగ్రాం 2 కింద ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పింది.

Pakistan: పాక్‌కు ఏడీబీ 800 మిలియన్ డాలర్ల సాయం.. భారత్ తీవ్ర అభ్యంతరం

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాలకు సాయం చేస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్టేనని భారత్ చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ దాయాది దేశానికి ఏషియన్ డవలప్‌మెంట్ బ్యాంకు (ADB) భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. 800 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి సలహాదారు ఖుర్రం షాజాద్ సామాజిక మాధ్యమంలో ధ్రువీకరించారు. పాలసీ ఆధారిత లోన్ (పీబీఎల్) కింది 300 మిలియన్ డాలర్లు, ప్రోగ్రాం ఆధారిత గ్యారెంటీ (పీజీబీ) కింద 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఏడీబీ మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు.


పాక్‌కు ఆర్థిక ప్యాకేజీ విషయాన్ని ఫిలిప్పీన్‌లోని ఏడీబీ సైతం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. 'ఇంప్రూవ్డ్ రిసోర్సె్ మొబిలైజేషన్ అండ్ యుటిలైజేషన్ రిఫార్మ్ ప్రోగ్రాం'లోని సబ్ ప్రోగ్రాం 2 కింద ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పింది. పాకిస్థాన్ స్థూల ఆర్థిక పరిస్థితులను (Macroeconomic conditions) మెరుగుపరచుకోవడంలో గణనీయ ప్రగతి సాధించిందని పాక్ ఏడీబీ కంట్రీ డైరెక్టర్ ఎమ్మా ఫ్యాన్ తెలిపారు. విధానపరమైన, వ్యవస్థాపరమైన సంస్కరణలతో పబ్లిక్ ఫైనాన్స్‌ పటిష్టత, స్థిరమైన వృద్ధి సాధించేందుకు పాక్ కట్టుబడి ఉందని, దానికి ఈ ఆర్థిక ప్యాకేజీ బలం చేకూరుస్తుందని చెప్పారు. ఇందువల్ల పన్నుల విధానం మెరుగుపరచుకునేందుకు వీలుకలుగుతుందని, డిజిటలైజేషన్, ఇన్వెస్టిమెంట్ ఫెసిలిటేషన్, ప్రైవేటు రంగ అభివృద్ధిని ప్రమోట్ చేయడం వల్ల ఆర్థిక లోటు, ప్రభుత్వ రుణాల భారం తగ్గుతుందని అన్నారు.


భారత్ తీవ్ర అభ్యంతరం

కాగా, పాకిస్థాన్‌కు ఏడీబీ భారీ ఆర్థిక సాయంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మిలటరీ అవసరాల పేరుతో అభివృద్ధి నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సంస్కరణలపై పాక్ చిత్తశుద్ధిని ప్రశ్నించింది. పాకిస్థాన్ జీడీపీలో పన్నుల వసూళ్లు గత కొంతకాలంగా తగ్గిపోయాయని తెలిపింది. పన్నుల వసూళ్లు 2018లో 13 శాతం ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరానికి 9.2 శాతానికి పడిపోయాయని, ఇదే కాలానికి రక్షణ వ్యయాన్ని పాకిస్థాన్ గణనీయంగా పెంచుకుంటూ పోతోందని భారత్ వివరించింది.


ఇవి కూడా చదవండి..

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్‌కు గుడ్‌న్యూస్

For National News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 05:50 PM