Chinese PL15 Missile: భారత్పై చైనా మిసైళ్లను వాడినట్టు అంగీకరించిన పాక్
ABN , Publish Date - May 09 , 2025 | 09:56 PM
చైనా తయారు చేసిన అత్యాధునిక పీఎల్15 మిసైల్ భారత్ చేతికి చిక్కడంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: చైనా తయారు చేసిచ్చిన పీఎల్-15 మిసైళ్లను భారత్పై ప్రయోగించినట్టు పాక్ ఎయిర్ఫోర్స్ శుక్రవారం అంగీకరించింది. పాక్ ప్రయోగించిన ఓ పీఎల్-15 మిసైల్ పలు కారణాలతో నిరుపయోగమై భారత భూభాగంలో పడింది. చివరకు భద్రతా దళాల కంట పడింది. ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది. పీఎల్-15 మిసైళ్ల పేరు చెబితే పాశ్చాత్య దేశాలు కూడా ఒకింత అప్రమత్తత ప్రదర్శిస్తాయి. అమెరికాను టార్గెట్ చేసేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకున్న ఈ మిసైల్ను చైనా ఇప్పటివరకూ ఎక్కడా ప్రయోగించలేదు. దీని సామర్థ్యాల గురించి ప్రపంచ దేశాలు వినడమే కానీ దాని పనితీరు ప్రత్యక్షంగా పరిశీలించలేదు. ఈ నేపథ్యంలో భారత్కు లభించిన పీఎల్-15పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఏమిటీ పీఎల్-15
గగనతల లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ మిసైల్ దీర్ఘశ్రేణి తరగతికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. దీని రేంజ్ 200 కిలోమీటర్లు ఉండొచ్చని సమాచారం. సామర్థ్యం పరంగా ఇది భారత్ వద్ద ఉన్న అస్త్ర మిసైల్తో సరిసమానమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చైనా ఇటీవలే ఈ మిసైల్స్కు పాక్కు సరఫరా చేసినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు ఈ మిసైల్పై ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. చైనాతో యుద్ధం అంటూ జరిగితే అమెరికా మొదట ఎదుర్కొనేది ఈ మిసైల్స్నే. వాస్తవానికి పాక్కు సరఫరా చేసిన మిసైల్స్ సామర్థ్యం కాస్త తక్కువని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వద్ద పూర్తిస్థాయి వర్షన్లు ఉన్నాయని, వాటి టెక్నాలజీని గోప్యంగా ఉంచేందుకు చైనా ఎవరికీ సరఫరా చేయదని కూడా చెబుతున్నారు.
అయితే, పీఎల్-15ని ఢీకునేందుకు అమెరికా ఇప్పటికే ఏఐఎమ్-260 అనే టాక్టికల్ మిసైల్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ మిసైల్ను అధ్యయనం చేసేందుకు అగ్రరాజ్యం కచ్చితంగా ఆసక్తి చూపుతుంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావన కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
పాక్తో ఉద్రిక్తతలు.. దేశ ప్రజలకు రోహిత్ శర్మ రిక్వెస్ట్
సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
ఇండో-పాక్ వార్పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
For National News And Telugu News