Share News

NISAR Satellite: అంగుళం తేడానూ పట్టేసే నిసార్‌

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:33 AM

భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్‌ చేసేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది.

NISAR Satellite: అంగుళం తేడానూ పట్టేసే నిసార్‌
NISAR Satellite

భూమిపై అడవులు, పంటలు, మంచు అన్నీ జల్లెడ పట్టేసే ఉపగ్రహం.. 12 రోజులకోసారి భూమంతా స్కాన్‌

  • భూకంపాలు, కొండ చరియలు విరిగిపడే ముప్పును ముందే గుర్తించే అవకాశం

  • నాసా, ఇస్రో ఉమ్మడి ప్రాజెక్టు ప్రత్యేకతలు

  • 30న శ్రీహరికోట నుంచి నింగిలోకి

న్యూఢిల్లీ, జూలై 26: భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్‌ చేసేస్తుంది. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జల వనరులు, మంచు ప్రాంతాలు.. ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. భూమి పొరల్లో ఒక్క అంగుళం మార్పు వచ్చినా గుర్తించేస్తుంది. కొండచరియలు విరిగిపడటాన్ని, భూకంపాలను, అగ్నిపర్వతాలు బద్దలవడాన్ని ముందే గుర్తించేందుకు అవకాశం ఇస్తుంది. ఇది అమెరికా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన ‘నిసార్‌ (నాసా ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌)’ ఉపగ్రహం ప్రత్యేకత ఇది. ఒక ట్రక్కు పరిమాణంలో, 2,393 కిలోల బరువున్న నిసార్‌ ఉపగ్రహాన్ని ఈ నెల 30న సాయంత్రం 5.40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎ్‌సఎల్‌వీ ఎఫ్‌16 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ఉపగ్రహం భూమికి 743 కిలోమీటర్ల ఎత్తున సూర్యానువర్తన కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశీలిస్తుంది. దీనిలో నాసాకు చెందిన ఎల్‌-బ్యాండ్‌, ఇస్రోకు చెందిన ఎస్‌-బ్యాండ్‌ రాడార్లు, రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌ (సార్‌), 12 మీటర్ల వ్యాసం ఉండే జల్లెడ వంటి ప్రత్యేక రాడార్‌ యాంటెన్నా ఉంటాయి. ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొదటిది కావడం గమనార్హం.


భారత్‌కు వాటా సగం.. ఖర్చు స్వల్పం

నిసార్‌ ప్రాజెక్టులో నాసా, ఇస్రోలకు చెరో సగం సమాన వాటా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా శాటిలైట్‌ డిజైన్‌, తయారీ, పరికరాలు, గ్రౌండ్‌ స్టేషన్లు, రాకెట్‌, ప్రయోగం బాధ్యతలను ఇరు దేశాల మధ్య విభజించుకున్నాయి. ప్రాజెక్టుకు మొత్తం రూ.11,200 కోట్లు (1.3 బిలియన్‌ డాలర్లు) వ్యయం అవుతుండగా.. అందులో ఇస్రోకు అవుతున్నది సుమారు రూ. వెయ్యి నుంచి 1,200 కోట్లేనని అంచనా. ఇస్రో రాకెట్‌ ప్రయోగాలు, నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ కావడంతో మన దేశం భరించాల్సిన వ్యయం స్వల్పంగా ఉందని.. ప్రాజెక్టులో వాటా మాత్రం సగం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.


నిసార్‌ ప్రత్యేకతలన్నో..

  • భూమి పైపొరలో ఒక్క సెంటీమీటరు మార్పులు వచ్చినా గుర్తిస్తుంది. దీనితో భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, కొండ చరియలు విరిగిపడటం, పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే పరిస్థితులను ముందే గుర్తించవచ్చు.

  • భూమిపై, సముద్రాల్లో మంచు పరిస్థితిని, ఎంతెంత మందంతో ఉంది? కరిగి నీరుగా మారే తీరును కచ్చితత్వంతో గుర్తిస్తుంది. పర్యావరణ ప్రభావాలను గుర్తించడానికి తోడ్పడుతుంది.

  • భూమిపై అడవులు, పంటల విస్తీర్ణం, అభివృద్ధి, పచ్చదనంలో తేడాలను.. నేల తేమను, నీటి వనరులను గుర్తిస్తుంది. వాటిలో ఎప్పటికప్పుడు వచ్చే తేడాలను గమనిస్తుంది. తగిన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

  • తుపానులు, వరదలు, సునామీలు, కార్చిచ్చులు వంటివాటి రియల్‌ టైమ్‌ డేటా (ఆ సమయంలో నెలకొన్న పరిస్థితి)ని అందించి.. సహాయక చర్యలకు తోడ్పడుతుంది.

  • భూమి పరిశీలనకు సంబంధించి నిసార్‌ ఉపగ్రహం నుంచి రోజుకు 4,300 గిగాబైట్ల (సుమారు వెయ్యి నుంచి 1,500 సినిమాల అంత) డేటా అందుతుందని నాసా తెలిపింది. ఈ డేటాను ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా వినియోగించుకోవడానికి అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే 80 సంస్థలు నిసార్‌ డేటా కోసం ఒప్పందం చేసుకున్నాయని వివరించింది.


ఈవార్తలు కూడా చదవండి..

పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 07:52 AM