Mumbai: ఈ చివరి క్షణంలోనూ నీపై ప్రేమే..
ABN , Publish Date - Mar 08 , 2025 | 05:33 AM
భార్య వేధింపులు తాళలేక ముంబైలో మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్లో యానిమేటర్గా పనిచేసే నిశాంత్ త్రిపాఠి (41) విలే పార్లేలోని ఓ హోటల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సూసైడ్ నోట్ రాసి మరో భార్యా బాధితుడి ఆత్మహత్య
ముంబై, మార్చి 7: భార్య వేధింపులు తాళలేక ముంబైలో మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్లో యానిమేటర్గా పనిచేసే నిశాంత్ త్రిపాఠి (41) విలే పార్లేలోని ఓ హోటల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరణానికి ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ను తను పనిచేసే కంపెనీ వెబ్సైట్కు పంపాడు. ఆ నోట్లో తన భార్య అపూర్వ పారిఖ్పై ఎనలేని ప్రేమను వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను ఉండను.
ఇప్పటి వరకు నువ్వు వేధించిన దానికి ఈ చివరి క్షణాల్లో నిన్ను నేను అసహ్యించుకోవాలి. కానీ నేను అలా చేయలేను. ఈ చివరి క్షణాల్లోనూ నీపైన ప్రేమే ఉంది. అది ఎన్నటికీ చెరిగిపోదు. నా చావుకు నువ్వు, నీ బంధువు ప్రార్థన మిశ్రా కారణం’’ అని లేఖలో రాశాడు. మహిళా హక్కుల కార్యకర్త అయిన నిశాంత్ తల్లి నీలమ్ చతుర్వేది ఫిర్యాదు మేరకు పోలీసులు అపూర్వ, ప్రార్థన మిశ్రాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.