PM Modi Military Meeting: కొట్టేది గట్టిగానే
ABN , Publish Date - May 05 , 2025 | 04:45 AM
భారత్ త్రివిధ దళాలతో పాక్పై విస్తృత దాడికి సన్నద్ధమవుతోంది. మోదీ సమీక్షలతో యుద్ధ కార్యాచరణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు
త్రిముఖ దాడులకు సిద్ధం.. బ్లూప్రింట్ రెడీ
వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు!
పాక్పై భారీ దాడికి సంకేతాలు.. వేగంగా పరిణామాలు
ప్రపంచానికి తెలిసేలా దాడి.. అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం
ఎల్వోసీ సమీపంలో యుద్ధ విమానాలు.. సరిహద్దు వెంబడి ‘ఎయిర్ డిఫెన్స్’
పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా.. రష్యా నుంచి ఇగ్లా-ఎస్ క్షిపణుల కొనుగోళ్లు
పంజాబ్లో ఇద్దరు పాక్ గూఢచారుల అరెస్టు.. సరిహద్దుల్లో 8 చోట్ల పాక్ కవ్వింపు
బాగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి నిలిపివేత.. పాకిస్థాన్లో మొదలైన యుద్ధ భయం
యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్
4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతఘ్ని గుండ్లు.. ఉక్రెయిన్కు విక్రయాల వల్లే..
పాక్ గొప్పలన్నీ తప్పులే!.. పీఎల్15 క్షిపణులపై ఆర్భాటపు ప్రచారం
వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కి.మీ.లు అంటూ డంబాలు
న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదుల స్వర్గధామంగా మారిన దాయాది దేశం పాకిస్థాన్పై భారత్ భారీ దాడికి సిద్ధమైందా? ప్రపంచ దేశాలకు తమ చర్య కనిపించేలా పెద్ద దెబ్బ కొట్టనుందా? బాలాకోట్ తరహా ప్రతీకారమైతే ఇప్పటికే జరిగి ఉండేదా? అలా కాకుండా.. నష్టాన్ని ప్రపంచానికి కనిపించేలా భారత ప్రభుత్వం సిద్ధమైందా? త్రివిధ దళాలతో.. త్రిముఖ వ్యూహంతో పాక్ నడ్డి విరచనుందా? వేగంగా మారుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఆదివారం తాజాగా నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఎనిమిది చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడగా.. భారత్ దీటుగా బదులిచ్చింది. సరిహద్దుల్లో భారత్ భారీ సైన్యాన్ని, ‘ఎయిర్ డిఫెన్స్’ వ్యవస్థలను మోహరించింది. ఆర్మీ కదలికల సమాచారాన్ని శత్రుదేశానికి పంపుతున్న ఇద్దరు గూఢచారులను పంజాబ్లో అరెస్టు చేసింది. అరేబియా సముద్రంలో యుద్ధ విమాన వాహక నౌకను మోహరించడంతోపాటు.. పాకిస్థాన్ తీరానికి 85 నాటికల్ మైళ్ల దూరంలో.. గుజరాత్ తీరప్రాంతంలో నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది. లద్ధాఖ్, జమ్మూకశ్మీర్ బేస్లలో భారత వాయుసేన మోహరించింది. అంతేకాదు.. రక్షణ వ్యవస్థలైన ఇగ్లా-ఎ్సలను అత్యవసరంగా పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇగ్లా-ఎస్, ఇతర క్షిపణి రక్షణ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను విజయవంతంగా పూర్తిచేసింది. అటు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులను భేటీ అవుతూ.. సర్వసన్నద్ధతపై ఆరా తీస్తున్నారు.
మరోవైపు పాకిస్థాన్లో యుద్ధ భయం నెలకొంది. రోజూ ఏదో ఒక ప్రకటన చేస్తున్న ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గగనతల యుద్ధం తప్పదని తాజాగా వ్యాఖ్యానించారు. యుద్ధం వస్తే బ్రిటన్కు పారిపోతానని ఏకంగా ఓ ఎంపీ ప్రకటన చేయగా.. అణుబాంబులు వేస్తామంటూ రష్యాలోని పాక్ రాయబారి భారత్ను హెచ్చరించారు. అయితే.. భారత్తో యుద్ధమే వస్తే.. ఆయుధాల పరంగా పాకిస్థాన్ చావుదెబ్బ తినే ప్రమాదాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శతఘ్నుల్లో వినియోగించే 155 ఎంఎం గుండ్ల నిల్వలు భారీగా పడిపోయాయని, నాలుగు రోజులకు మాత్రమే సరిపోతాయని పాక్ సైన్యాధికారులే చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు వాటి తయారీ అసాధ్యమని పాకిస్థాన్ కోర్ కమాండర్ల సమావేశంలో ఆందోళన వ్యక్తం కావడం గమనార్హం..!

ఈ అంశంపై పాక్ ఆర్మీ మాజీ చీఫ్ ఆసిమ్ భాజ్వా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. మరో విశ్రాంత సైన్యాధికారి ఏకంగా పహల్గాం దాడి వెనక పాక్-చైనా కుట్ర ఉందని ఆరోపించారు. భారత ప్రభుత్వం సన్నద్ధతను బట్టి.. ఈ వారంలో యుద్ధ కార్యాచరణ పూర్తవుతుందని, పాక్పై నిర్దిష్ట చర్యలకు ప్రకటన చేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
త్రివిధ దళాల బ్లూప్రింట్ సిద్ధం!
భారత త్రివిధ దళాలు పాక్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధాని మోదీ కీలక సమాలోచనలు జరిపారు. ఈ భేటీతో త్రివిధ దళాధిపతులతో మోదీ వేర్వేరు భేటీలు పూర్తయినట్లయింది. గతనెల 30న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీతో విస్తృత చర్చలు జరిపారు. శనివారం నేవీ ఛీఫ్ అడ్మిరల్ దినేశ్.కె.త్రిపాఠీతో చర్చించారు. త్రివిధ దళాధిపతులు ముగ్గురూ పాకిస్థాన్పై త్రిముఖ దాడి చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని మోదీకి వివరించినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్ ఎదురు దాడి చేస్తే తిప్పిగొట్టేందుకు చేస్తున్న సన్నాహాలను కూడా వారు వివరించారు. వ్యూహ-ప్రతివ్యూహాలు ఎలా ఉండనున్నాయో వెల్లడించారు. దీంతో.. ఈ సారి త్రివిధ దళాలూ ఏదో రూపంలో పాకిస్థాన్ను చుట్టుముట్టి, కోలుకోలేని విధంగా దెబ్బకొట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఒకవైపు సరిహద్దుల్లో నియంత్రణ రేఖ దాటి దూసుకువెళ్లేందుకు సైన్యం ఉరకలు వేస్తుండగా, ఆక్రమిత కశ్మీర్లోని నిర్దిష్ట ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసేందుకు వైమానిక దళం క్షిపణి దాడులకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. అరేబియా సముద్రంలో మోహరించిన యుద్ద నౌకలు కూడా దీర్ఘశ్రేణి క్షిపణి దాడులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త్రివిధ దళాలు నిర్దిష్ట కార్యాచరణ, బ్లూప్రింట్తో సిద్ధంగా ఉండగా.. మోదీ సర్కారు గ్రీన్సిగ్నలివ్వడమే ఆలస్యమని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ఈ నెల 9న జరగనున్న ‘రష్యా విక్టరీ డే’కు భారత్ తరఫున వెళ్లాల్సిన ప్రతినిధి పేరు మారుతూ వస్తోంది. తొలుత ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండేది. ఆయన స్థానంలో రాజ్నాథ్ సింగ్ వెళ్తారని కేంద్రం చెప్పింది. తాజాగా రక్షణశాఖ సహాయమంత్రి సేథ్ వెళ్తారని ప్రకటించింది. యుద్ధం మొదలైతే.. ప్రధాని, రక్షణ మంత్రి భారత్లో ఉండడం అనివార్యమని, అందుకే వారు ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేగంగా పరిణామాలు..
భారత్ ఏదో చేయనుందనడానికి వేగంగా మారుతున్న పరిణామాలు సంకేతాలనిస్తున్నాయి. గత నెల 29న ప్రధాని మోదీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్తో భేటీ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు భద్రతావ్యవహారాల క్యాబినెట్ భేటీ జరగ్గా.. ఈ వారం మరోమారు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్తో పాటు.. మన దేశ రాయబారులు ఇప్పటికే అన్ని ముఖ్యమైన, మిత్రపక్ష దేశాలకు పరిస్థితిని వివరించారు. దాదాపు అన్ని దేశాలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి జైస్వాల్ ప్రకటించారు. మరోవైపు, ఇప్పటికే పాకిస్థాన్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)తో భారత్పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఐక్య రాజ్య సమితి(ఐరాస) భద్రతామండలిలో భారత్ చర్యలపై(సింధు జలాల ఒప్పందం నిలిపివేత, సరిహద్దు వెంబడి ఉద్రిక్తత) సోమవారం ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో బలూచిస్థాన్లో వేర్పాటు వాదులకు.. సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తుర్కియే, సౌదీఅరేబియా, మలేసియా.. ఇతర ఇస్లామిక్ దేశాలతో పాకిస్థాన్ చర్చలు జరుపుతున్నా.. భారత్కు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టుకోవడంలో సఫలం కావడం లేదని తెలుస్తోంది. భారత్తో ఘర్షణల నేపథ్యంలో నిర్వహించే అఖిలపక్షానికి హాజరయ్యేది లేదని పాక్లో ఇమ్రాన్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ పీటీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కారు తన యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తే..పాక్కు చావు దెబ్బ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలు కోరేది తప్పక జరుగుతుంది
భారత్పై దాడులకు ప్రయత్నించేవారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. ‘‘సరిహద్దుల్లో రక్షణతోపాటు.. సైనికులను, భారత పౌరులను కాపాడడం రక్షణ మంత్రిగా నా బాధ్యత. ప్రధాని మోదీ పనితీరు, ఆయనకు ఉన్న పట్టుదల గురించి అందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది కచ్చితంగా జరిగి, తీరుతుందని నేను హామీ ఇస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News