బందీపోరాలో ఎదురుకాల్పులు: లష్కర్ కమాండర్ లల్లీ హతం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:36 AM
బందీపోరా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. పహల్గాం దాడి తర్వాత చేపట్టిన గాలింపులో ఈ విజయంతో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ పడింది
శ్రీనగర్, ఏప్రిల్ 25: జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. శుక్రవారం బందీపోరా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కర్ ఎ తోయిబాకు చెందిన అగ్రస్థాయి కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. పహల్గాం దుర్ఘటన అనంతరం పోలీసులు-భద్రతా బలగాలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతుండగా కుల్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు కచ్చితమైన సమాచారం అందింది. బలగాలు అజాస్ ప్రాంతం వద్దకు రాగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొదట ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనంతరం జవాన్లు దీటుగా సమాధానం ఇవ్వడంతో అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. గాయపడ్డ పోలీసులను వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు.