Rahul Gandhi Skip Red Fort: ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:01 PM
Rahul Gandhi Skip Red Fort: కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం ఎర్రకోటకు వెళ్లలేదు. వీరు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకపోవటంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలు మాత్రం ఎర్రకోటకు వెళ్లలేదు. వీరు ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనకపోవటంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీటింగ్ సదుపాయాలు సరిగా ఉండవన్న కారణంతోటే ఈ ఇద్దరూ ఎర్రకోటకు వెళ్లలేదని తెలుస్తోంది. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా.. ఈ సంవత్సరం ఎర్రకోటకు వెళ్లటం మానుకున్నారని సమాచారం. అయితే, రాహుల్, ఖర్గేలు ఎర్రకోటకు ఎందుకు వెళ్లలేదన్నా దానిపై కాంగ్రెస్ పార్టీనుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక, ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాహుల్ తన పోస్టులో.. ‘ఈ స్వేచ్ఛ మన స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాల ఫలితం. ఇది స్వాతంత్ర్యం మాత్రమే కాదు.. నిజాయితీ, సమానత అనే పునాదిపై న్యాయం నిలిచేలా.. అద్భుతమైన భారత్ను నిర్మించాలనే సంకల్పం కూడా. ప్రతీ హృదయం గౌరవంతో, సోదరభావంతో నిండి ఉండాలి. ఈ అమూల్యమైన వారసత్వ గౌరవాన్ని కాపాడటం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్’ అని పేర్కొన్నారు.
ఖర్గే తన పోస్టులో.. ‘మన ప్రజాస్వామ్యం ప్రతిష్టాత్మకంగా భావించే స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వ విలువలకు మనల్ని మనం తిరిగి అంకితం చేసుకోవడానికి స్వాతంత్ర్య దినోత్సవం ఒక పవిత్ర సందర్భం’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
దేశ్ రంగీల పాటకు రిహార్సల్స్.. డ్యాన్స్ అదరగొట్టిన ఉపాధ్యాయుడు
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా బ్లాక్ కారు.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా?