Karnataka: ‘డీలిమిటేషన్’పై సమావేశానికి మద్దతు
ABN , Publish Date - Mar 14 , 2025 | 06:24 AM
లోక్సభ, అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించే సమావేశానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.

నేను రాలేను.. డీకే శివకుమార్ హాజరవుతారు
తమిళనాడు సీఎంకు కర్ణాటక ముఖ్యమంత్రి లేఖ
బెంగళూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): లోక్సభ, అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అంశంపై నిర్వహించే సమావేశానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. అయితే ముందస్తు షెడ్యూల్, పలు కారణాల రీత్యా తాను ఈనెల 22న జరిగే ఈ భేటీకి హాజరు కాలేకపోతున్నానని, సమావేశ ప్రాముఖ్యత నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్కు గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన సాధక బాధకాలపై అవగాహన ఉందని, దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో సమగ్ర చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్కు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రె్సకు తమిళనాడులోని అధికార డీఎంకేతో మైత్రి ఉందని, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం సంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన మంత్రితో చర్చించామని, పార్టీ అధిష్ఠానంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పామని తెలిపారు.