Karachi Port Closure: కరాచీ పోర్ట్ మూసివేస్తే పాక్ కథ ముగిసినట్లే
ABN , Publish Date - May 09 , 2025 | 03:46 AM
కరాచీ పోర్టు పాకిస్థాన్కు కీలకమైన వాణిజ్య కేంద్రం. దీని మూసివేత పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
70 శాతం ఎగుమతులు, దిగుమతులు బంద్
ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
న్యూఢిల్లీ, మే 8: పాకిస్థాన్ వాణిజ్య రాజధాని అయిన కరాచీ దాయాది దేశానికి అత్యంత కీలక నగరం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న కరాచీ పోర్టు నుంచి70 శాతం ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ నగరం పరిశ్రమల పరంగా కూడా అభివృద్ధి చెందింది. అనేక ప్రముఖ బ్యాంకులు, ఆర్ధిక, అంతర్జాతీయ సంస్థలకు ఇది కీలక నగరంగా మారింది. పాకిస్థాన్ జీడీపీలో 20 శాతం ఈ నగరం నుంచే వస్తుంది. స్టాక్ మార్కెట్కు కూడా ఇదే ప్రధాన నగరం. కరాచీ పోర్టును మూసివేస్తే పాకిస్థాన్ త్రివిధ దళాలకు చమురుతో పాటు ఆహారధాన్యాలు, ఔషధాలు, కీలక ఆయుధాల సరఫరా నిలిచిపోతుంది. వాణిజ్య కార్యకలాపాలు స్థంభించే ప్రమాదం ఉంది. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.