Cyber Crime: మోసగాళ్లకు మోసగాడు సైబర్ నేరగాడికే రూ.10వేల టోకరా
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:32 AM
తనకు ఫోన్ చేసి, బెదిరించిన సైబర్ కేటుగాడిని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టాడు. సైబర్ క్రిమినల్ నుంచి మూడు విడతల్లో ఏకంగా రూ.10,480 వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ అనే యువకుడికి కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాడి నుంచి ఫోన్కాల్ వచ్చింది.
అరెస్టు చేస్తానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి ఉల్టా టోపీ
లఖ్నవూ, మార్చి 17: సైబర్ నేరగాళ్ల నేరశైలి తెలిసిందే..! పార్శిల్ వచ్చిందని, కస్టమ్స్ క్లియరెన్స్కు డబ్బులు చెల్లించాలని, వేర్వేరు పన్నులతో విడతల వారీగా అందినకాడికి దండుకుని, ఫోన్ సిమ్కార్డు మార్చేస్తారు..! అయితే.. తనకు ఫోన్ చేసి, బెదిరించిన సైబర్ కేటుగాడిని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టాడు. సైబర్ క్రిమినల్ నుంచి మూడు విడతల్లో ఏకంగా రూ.10,480 వసూలు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ అనే యువకుడికి కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాడి నుంచి ఫోన్కాల్ వచ్చింది. ‘‘నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నాను. నీకు సంబంధించిన అశ్లీల వీడియోలను గుర్తించాం. నీ మీద కేసు నమోదు చేస్తున్నాం. అరెస్టు చేస్తాం. ఒకవేళ కేసు పెట్టొద్దంటే.. రూ.16 వేల లంచం ఇవ్వాల్సిందే..!’’ అంటూ బెదిరించాడు. ఈ కాల్ చేసింది సైబర్ నేరగాడే అని గుర్తించిన భూపేంద్ర.. ఉల్టా కథ అల్లాడు. ‘‘అంకుల్.. అంత పని చేయకండి ప్లీజ్..! మా అమ్మకు మాత్రం చెప్పకండి. మీకు డబ్బులు చెల్లిస్తాను. కాస్త సమయం ఇవ్వండి’’ అంటూ అమాయకంగా నటించాడు. సైబర్ నేరగాడి నుంచి మరోమారు ఫోన్కాల్ రావడంతో.. ‘‘అంకుల్.. మీకు డబ్బులు చెల్లిస్తాను. అయితే.. నా చైన్ ఒకటి తనఖాలో ఉంది. దాన్ని విడిపించాలంటే రూ.3 వేలు కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. మీరు సాయం చేస్తే.. మీకు ఇవ్వాల్సిన మొత్తంతో కలిపి ఇచ్చేస్తాను’’ అని నమ్మబలికాడు. అంతే.. సైబర్ నేరగాడు యూపీఐ ద్వారా రూ.3 వేలు పంపించాడు. ఆ తర్వాతి రోజు.. ఏమైందంటూ భూపేంద్రకు మరోమారు ఫోన్ చేశాడు. దానికి భూపేంద్ర.. ‘‘అంకుల్, నేను మైనర్ని అని చెప్పి చైన్ విడిపించుకోనివ్వడం లేదు. నేను పాన్ బ్రోకర్ దగ్గరకు వెళ్లి, మీకు కాల్ చేస్తాను’’ అని ఫోన్ పెట్టేశాడు.
కొంత సేపటికి కేటుగాడికి ఫోన్ చేసిన భూపేంద్ర తన మిత్రుడిని పాన్ బ్రోకర్గా పరిచయం చేస్తూ.. ఫోన్ ఇచ్చాడు. భూపేంద్ర మిత్రుడు వడ్డీతో కలిపి మరో రూ.4,480 చెల్లిస్తేనే చైన్ ఇస్తానని తెగేసి చెప్పాడు. దాంతో కేటుగాడు ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. ఆ తర్వాతి రోజు మరోమారు భూపేంద్రకు ఫోన్ చేసి విచారించగా.. ‘‘అంకుల్.. బ్యాంకులో రూ.1.1 లక్షల గోల్డ్లోన్ ఇస్తామన్నారు. అయితే.. ప్రాసెసింగ్ ఫీజు రూ.3 వేలు నగదు రూపంలో ఇవ్వాలంటున్నారు. మీకు తెలుసుకదా? నా దగ్గర అంత డబ్బు లేదు’’ అని నమ్మబలికాడు. దీంతో సైబర్ కేటుగాడు ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు. ఆ తర్వాత అనుమానం వచ్చిన సైబర్ నేరగాడు.. తనను మోసం చేస్తున్నట్లు గుర్తించి, భూపేంద్రతో కాళ్లబేరానికి దిగాడు. ‘‘తప్పయిపోయింది. నేను పంపిన డబ్బులు నాకు తిరిగి బదిలీ చేయి’’ అంటూ వేడుకున్నాడు. అయితే.. భూపేంద్ర మాత్రం స్థానిక పోలీసులకు విషయం చెప్పి.. ఫిర్యాదు చేశాడు. తాను కొల్లగొట్టిన రూ.10,480లను అవసరాల్లో ఉన్నవారికి అందజేస్తానని పేర్కొన్నాడు. ఇప్పుడు భూపేంద్ర ఉదంతం నెట్టింట వైరల్గా మారుతోంది. నెటిజన్లు అతను చాకచక్యంగా వ్యవహరించిన తీరుకు కితాబిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్