Saquib Nachan: ఐఎస్ఐఎస్ ఇండియా మాజీ చీఫ్ ఆసుపత్రిలో కన్నుమూత
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:48 PM
సాకిబ్ అబ్దుల్ హమీద్ నాచన్ శనివారంనాడు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మెదడులో నరాలు చిట్లడంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
న్యూఢిల్లీ: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) మాజీ ఆఫీస్ బ్యారర్, ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS) మాజీ చీఫ్ సాకిబ్ అబ్దుల్ హమీద్ నాచన్ (Saquib Abdul Hamid Nachan) శనివారంనాడు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మెదడులో నరాలు చిట్లడం (Brain hemorrhage)తో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మహారాష్ట్రలోని థానే జిల్లా పడ్ఘా నివాసి అయిన నాచన్ నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 24న తీహార్ జైలు నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అన్నివిధాలా చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ హెమరేజ్తో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు.
2023లో అరెస్టు
ఐఎస్ఐఎస్ మాడ్యూల్పై 2023లో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు జరిపిన క్రమంలో 67 ఏళ్ల నాచన్ పట్టుబడ్డారు. దీనికి ముందు 2003 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా నాచన్ ఉన్నారు. పలు దేశవ్యతిరేక కార్యకలాపాల్లోనూ ప్రమేయమున్నట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. వీటిపై విచారణ జరుగుతోంది.
కాగా, ఆసుపత్రిలో కన్నుమూసిన నాచన్ను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఆయన స్వగ్రామమైన పడ్ఘా సమీపంలోని బోరివలిలో ఆదివారంనాడు అంత్యక్రియలు జరుపనున్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి