Air India Crash: బోయింగ్ 787-8 విమానాల నిలిపివేత.. పరిశీలనలో కేంద్రం
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:04 PM
అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దుర్ఘటన(Air India) నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భద్రతా సమీక్ష జరిపేంత వరకూ బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందు కోసం భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపాయి. అహ్మదాబాద్ దుర్ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున అది పూర్తి కాగానే 787-8 విమాన సేవలు కొనసాగించాలా, వద్దా? అనే దానిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నాయి.

అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతిచెందగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మధ్యాహ్నం 1.30 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే అనూహ్యంగా బీజే మెడికల్ కాలేజీ డాక్టర్ల రెజిడెన్షియల్ క్వార్టర్డ్లోకి విమానం దూసుకుపోయింది. ఆ తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఇంజన్లలో ముందుకు లాగే శక్తి కోల్పోవడం, పక్షి ఢీకొనడం వంటివి విమానం కూలిపోవడానికి కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.

బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు కలిగి ఉండి ఇంధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటుందనే పేరుంది. 2011 అక్టోబర్లో ఈ డ్రైమ్లైనర్ సేవలు మొదలైనప్పటి నుంచి గత 14 ఏళ్లలో 100 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసిందని, నేవియేషన్ చరిత్రలో ఏ డ్రీమ్లైనర్ కూడా ఇంత వేగంగా రికార్డు సాధించలేదని బోయింగ్ వెబ్సైట్ చెబుతోంది. ఈ మోడల్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 2,500 వరకూ 787-8ల అమ్మకాలను బోయింగ్ జరుపగా, ఎయిర్ ఇండియా 47 విమానాలను కొనుగోలు చేసింది. కాగా, అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశించినట్టు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి