Share News

AAP: ప్రత్యామ్నాయ రాజకీయ ప్రయోగం విఫలం?

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:12 AM

2011లో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా అవినీతికి వ్యతిరేకంగా లోక్‌జన్‌పాల్‌ వ్యవస్థ కోసం గాంధేయవాది అన్నాహజారే ఉద్యమించారు. ఆ సమయంలో హజారే వెంట ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు.

AAP: ప్రత్యామ్నాయ రాజకీయ ప్రయోగం విఫలం?
Arvind Kejriwal

  • కేజ్రీవాల్‌ సహా ఆప్‌ దిగ్గజ నేతల ఓటమితో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం

  • అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఆవిర్భవించి అవే ఆరోపణలతో విలవిల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి8: భారత్‌లో రాజకీయ పార్టీల మనుగడ కులం, మతం, ప్రాంతం, భాషలపై ఆధారపడి ఉండటం సాధారణమే. అయితే వీటి అవసరం లేకుండానే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అవతరించింది. 2011లో ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా అవినీతికి వ్యతిరేకంగా లోక్‌జన్‌పాల్‌ వ్యవస్థ కోసం గాంధేయవాది అన్నాహజారే ఉద్యమించారు. ఆ సమయంలో హజారే వెంట ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించారు. స్వయంగా అన్నా హజారే వద్దని నివారించినా కేజ్రీవాల్‌ ఆప్‌ను ప్రారంభించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని, సుపరిపాలన అందిస్తామని, సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నిలబెడతానని నాడు కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. పార్టీ పేరులోనే ఆమ్‌ ఆద్మీ ఉండటంతో సామాన్యులకు చేరువయ్యారు. మధ్యతరగతి వర్గానికి కూడా దగ్గరయ్యారు. ఐఆర్‌ఎస్‌ అధికారి కావడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతానని హామీ ఇవ్వడంతో ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ వెంటే నడిచారు.


2013 నుంచి 2022 దాకా తిరుగేలేదు..

2013లో నాటి కాంగ్రెస్‌ ప్రభుతాన్ని తొలిసారి ఓడించారు. 28 చోట్ల మాత్రమే గెలిచినా కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 49 రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. 2015, 2020 సంవత్సరాల్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆప్‌నకు మళ్లీ పెద్ద ఎత్తున పట్టం కట్టారు. 2022లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆప్‌ చిత్తుగా ఓడించింది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని కేజ్రీవాల్‌ ప్రకటించుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ తరహాలో దేశంలో కేజ్రీవాల్‌ ప్రధాన ప్రత్యామ్నాయ రాజకీయ నేతగా, ఆశాకిరణంగా కనిపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్ల శాతాన్ని పెంచుకున్న ఆప్‌ జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. అయితే చూస్తుండగానే ఆప్‌ ప్రభను కోల్పోవడం ప్రారంభమైంది. 2020లో ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆప్‌ను అవినీతి ఆరోపణలు వెంటాడాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి వచ్చిన పార్టీ చివరకు అవే ఆరోపణలకు చిక్కింది. ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్‌ ఆరోపణలు, రూ.33 కోట్ల ప్రజాధనంతో రాజభవనం(శీశ్‌మహల్‌) లాంటి ఇల్లు కట్టుకోవడం విమర్శలకు తావిచ్చింది. మద్యం కుంభకోణంలో ఆప్‌ నేతలతో పాటు స్వయంగా కేజ్రీవాల్‌ కూడా తీహార్‌ జైలుకెళ్లి రావడంతో సామాన్యుల్లో నమ్మకం సన్నగిల్లింది. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా, సత్యేంద్రజైన్‌ లాంటి దిగ్గజ నేతలంతా ఓడిపోవడంతో ఆప్‌ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 09:24 AM