Rahul Gandhi: సావర్కర్ గురించి తెలుసుకోవాలని రాహుల్ను ఆదేశించలేం
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:12 AM
విపక్షనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ సావర్కర్ గురించి రాహల్...
పిటిషనర్ దాఖలు చేసిన పిల్ను చదవాలని ఆయనకు సూచించలేం
బాంబే హైకోర్టు స్పష్టం..పిల్ కొట్టివేత
ముంబై, జూలై 15: విపక్షనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బాంబే హైకోర్టు కొట్టివేసింది. హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ సావర్కర్ గురించి రాహల్ పరిపక్వత లేని, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని, తద్వారా పిటిషనర్ హక్కులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోర్టులో ‘అభినవ్ భారత్ కాంగ్రెస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు పంకజ్ ఫడ్నిస్ పిల్ దాఖలు చేశారు. సావర్కర్పై రాహుల్కు ఉన్న జ్ఞాన శూన్యతను తొలగించుకునేందుకుగాను పిటిషన్ను చదవాలంటూ ఆయన్ను ఆదేశించాలని పిల్లో పంకజ్ కోరారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం బాంబే హైకోర్టు విచారించింది. సావర్కర్ గురించి అజ్ఞానాన్ని తొలగించుకునేందుకు పిల్లోని కంటెంట్ను చదవాలని రాహుల్ గాంధీని ఎలా ఆదేశించగలం? అని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. రాహుల్ భవిష్యత్తులో ప్రధాని అయితే విధ్వంసం సృష్టిస్తారని పిల్లో పంకజ్ ఆరోపించారు. దీనికి ధర్మాసనం.. ‘‘మాకైతే తెలియదు. రాహుల్ ప్రధాని అవుతారని మీకు తెలుసా?’’ అని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా, పరువు నష్టం దావాలో రాహుల్కు లఖ్నవూలోని స్థానిక ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన స్వయంగా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు అలోక్ వర్మ ముందు హాజరయి బెయిల్ పత్రాలను సమర్పించారు. వరుసగా అయిదు వాయుదాలకు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంటు జారీ చేసింది. దాంతో ఆయన కోర్టుకు స్వయంగా హాజరయి బెయిల్ పత్రాలను అందజేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘భారత్ జోడో యాత్ర ఎందుకని అడిగేవారు చైనా సైనికులు మన సైనికులను ఎందుకు కొట్టారని ఒక్కసారి కూడా అడగడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. అయితే, దెబ్బలు తిన్నారనడం భారత సైనికులను అవమానపరచడమేనని పేర్కొంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ పరువు నష్టం దావా వేశారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి