Karnataka: బలవంతంగా తీసుకొచ్చి చంపేశారు
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:11 AM
కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ను ఆయన భార్య, కుమార్తె బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి హత్య చేసినట్టు కుమారుడు కార్తికేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్తి గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానం
కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో ఆయన భార్య దారుణం
ఫిర్యాదులో కుమారుడి వెల్లడి.. భార్య, కుమార్తెపై కేసు
బెంగళూరు, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాశ్ హత్యలో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణ భయంతో తన సోదరి ఇంటికి వెళ్లిపోయిన ఓంప్రకాశ్ను రెండు రోజుల క్రితమే పల్లవి, కృతి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్టు ఆయన కుమారుడు కార్తికేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓంప్రకాశ్ కుమారుడు కార్తికేశ్ ఫిర్యాదు మేరకు పల్లవి, కృతిపై బీఎన్ఎస్ సెక్షన్ 103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన తల్లి పల్లవి వారం రోజులుగా తన తండ్రి ఓంప్రకాశ్ను చంపేస్తానని బెదిరించారని కార్తికేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తరచూ గొడవలెందుకని ఓంప్రకాశ్ చెల్లెలు సరిత ఇంటికి వెళ్లారని తెలిపారు. కాగా, ఆస్తి గొడవల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఓంప్రకాశ్ను పల్లవి ముఖంపై కారం చల్లి కత్తితో పొడిచి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో కుమార్తె కృతి భాగస్వామ్యం ఉందన్నారు. ఓంప్రకాశ్ అంత్యక్రియలు సోమవారం పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి.