Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ
ABN , Publish Date - May 10 , 2025 | 11:20 AM
Operation Sindoor: భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధానికి కారణం పాక్ రెచ్చగొట్టే విధానాలే కారణం అనటంతో ఎలాంటి సందేహం లేదు. భారత్ మంచి తనాన్ని చేతకాని తనంగా ఇన్ని రోజులు భావించింది. ఇప్పుడు యుద్ధానికి దిగేసరికి కాళ్ల బేరానికి వస్తోంది.

ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు ఆపరేషన్ సింధూర్పై ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రెస్ మీట్లో విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘ గత రెండు రోజుల నుంచి పాకిస్తాన్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ కేవలం ప్రతిస్పందిస్తోంది. పాకిస్తాన్ దాడులను అడ్డుకుంటోంది.. తిప్పికొడుతోంది’ అని అన్నారు.
అనంతరం కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. ‘ పశ్చిమ భాగం వైపు పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. భారత సైనికులు లక్ష్యంగా డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలతో దాడులు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి కూడా కాల్పులకు తెగబడుతోంది. మిస్సైల్స్తో కూడా దాడులకు ప్రయత్నించింది. వాటిని ఆర్మీ విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత ఏయిర్ బేస్లపై దాడులకు యత్నించింది. ఉదమ్ పూర్, పఠాన్ కోట్, ఆదమ్ పూర్లతో పాటు మరికొన్ని చోట్ల కాల్పులకు తెగబడింది. పలువురు సైనికులు గాయపడ్డారు.
ఇందుకు సమాధానంగా.. భారత దళాలు పాక్లోని మిలటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి ఈ దాడులు చేశాము. పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది. ఇది పరిస్థితి మరింత దిగజార్చే ప్రమాదకర చర్య‘ అని అన్నారు.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ.. ‘ పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఇండియన్ S-400 సిస్టమ్ను.. సిర్సా, సూరత్ ఘర్లోని ఏయిర్ ఫీల్డ్స్ను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్ చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలు. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: భారత్,పాక్ యుద్ధం.. పాక్లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్
Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..