Faridabad AC Blast: ఏసీ పేలుడు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:28 PM
మరో గదిలో నిద్రపోతున్న సచిన్ కొడుకు పొగ కారణంగా నిద్రలేచాడు. పొగనుంచి తనను తాను కాపాడుకోవడానికి రెండవ అంతస్తునుంచి కిందకు దూకేశాడు.
ఏసీ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కుటుంబసభ్యులతో పాటు వారి కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన హర్యానాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫరీదాబాద్కు చెందిన సచిన్ కపూర్ అనే వ్యక్తి తన భార్య రింకు కపూర్, కూతురు సుజన్ కపూర్, కొడుకుతో పాటు మరో ముగ్గురు కుటుంబసభ్యులతో కలిసి నాలుగు అంతస్తుల బిల్డింగులో నివాసం ఉంటున్నాడు.
ఆ ఫ్యామిలీ మొత్తం నాలుగవ అంతస్తులో నివసిస్తోంది. మూడో అంతస్తును సచిన్ తన ఆఫీస్గా వాడుకుంటున్నాడు. ఆదివారం రాత్రి సచిన్, రింకు, సుజన్, పెంపుడు కుక్క రెండవ అంతస్తులోని ఓ గదిలో నిద్రపోతూ ఉన్నారు. సచిన్ కొడుకు మరో గదిలో నిద్రపోతున్నాడు. సోమవారం తెల్లవారుజామున మొదటి అంతస్తులోని ఏసీ కంప్రెసర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ రెండో అంతస్తులోకి పాకింది. నిద్రలో ఉన్న సచిన్, రింకు, సుజన్ ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క ప్రాణాలు కూడా పోయాయి.
మరో గదిలో నిద్రపోతున్న సచిన్ కొడుకు పొగ కారణంగా నిద్రలేచాడు. పొగనుంచి తనను తాను కాపాడుకోవడానికి రెండవ అంతస్తునుంచి కిందకు దూకేశాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడు శబ్ధానికి స్థానికులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరకు చేరుకున్నారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన సచిన్ కొడుకును ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటల్ని ఆర్పారు. పోలీసులు రెండవ అంతస్తులోకి వెళ్లి చూడగా ముగ్గురు చనిపోయి కనిపించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
ఈఐపీఎల్లో మరోసారి అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన నేవీ..
పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..