BARC Fake Scientist Case: బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసు.. నిందితుడికి ఐఎస్ఐతో సంబంధాలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:28 PM
బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసులో విచారణ చేపడుతున్న ముంబై పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించారు. 1995 నుంచే అతడికి అనుమానాస్పద మార్గాల్లో నిధులు అందినట్టు గుర్తించారు. ప్రస్తుతం అతడి బ్యాంక్ అకౌంట్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బార్క్ శాస్త్రవేత్తనని చెప్పుకుంటున్న నిందితుడు అక్తర్ కుతుబుద్దీన్ హుస్సైన్ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుడిది ఝార్ఖండ్లోని జంషెడ్పూర్ అని పోలీసులు గుర్తించారు. అతడి సోదరుడు అదిల్ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు (BARC Fake Scientist Case).
వెలుగులోకి సంచలన విషయాలు..
హుస్సైన్ సోదరులకు 1995 నుంచే అనుమానాస్పద రీతిలో వివిధ మార్గాల్లో నిధులు అందాయని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మొదట్లో లక్షల్లో చెల్లింపులు జరిగాయని, ఆ తరువాత ఇవి కోట్లకు చేరుకున్నాయని కూడా గుర్తించారు. భారత న్యూక్లియర్ వ్యవస్థలకు సంబంధించి సీక్రెట్ సమాచారం చేర వేసినందుకు నిందితులు ఈ డబ్బులు పుచ్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. అక్తర్కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు అకౌంట్లో అనేక అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి (BARC Scientist Money Trail Probe).
అలాగే తానో సైంటిస్టు అని చెప్పుకున్నందుకు అతడిని 2004లో దుబాయ్ నుంచి బహిష్కరించినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్లో తనకు తెలిసిన వారి ద్వారా ఆ సోదరులు పలు ఫేక్ ఐడీలను సమకూర్చుకున్నట్టు తెలిసింది. తమ పేరిట ఉన్న పలు బ్యాంకు అకౌంట్లనూ వారు క్లోజ్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇద్దరికీ ఐఎస్ఐతో లింకు ఉండొచ్చనీ పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులిద్దరూ పాకిస్థాన్కు వెళ్లివచ్చినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తన ఐడీలు మార్చుకుంటూ అక్తర్ సీక్రెట్ జీవితాన్ని గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటి సాయంతోనే విదేశీ పర్యటనలు చేశాడని అనుమానిస్తున్నారు. అరెస్టు సమయంలో అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్తో పాటు పాత బ్యాంకు అకౌంట్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులకు ఏయే మార్గాల్లో నిధులు వస్తున్నాయో తెలుసుకునేందుకు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్
మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి