Delhi Child Assult Case: ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారం
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:05 AM
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయినతొమ్మిదేళ్ల బాలిక.. తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్కేస్లో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
తమ ఇంటికి సమీపంలోని బంధువుల దగ్గరకెళ్లి ఒంటరిగా తిరిగొస్తున్న చిన్నారిపై అఘాయిత్యం
అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో సూట్కేసులో లభ్యమైన మృతదేహం
న్యూఢిల్లీ, జూన్ 8: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. లైంగిక దాడికి గురై ప్రాణాలు కోల్పోయినతొమ్మిదేళ్ల బాలిక.. తన ఇంటికి సమీపంలోని మరో ఇంట్లోని సూట్కేస్లో శవమై కనిపించింది. న్యూఢిల్లీలోని దయాల్పూర్ ప్రాంతంలో శనివారం రాత్రి వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. దయాల్పూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తమ ఇంటికి సమీపంలో నివసించే బంధువులకు ఐసు ముక్కలు ఇచ్చేందుకు శనివారం సాయంత్రం ఏడు గంటలప్పుడు వెళ్లింది. అలా వెళ్లిన బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బాలిక కోసం గాలించడం మొదలుపెట్టారు. సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోకి బాలిక వెళ్లిందని తెలియడంతో దాని తాళం పగలుగొట్టి లోపలికి వెళ్లారు. ఆ ఇంట్లోని ఓ గదిలో రక్తం మరకలతో ఉన్న ఓ సూట్కేసు కనిపించడంతో దానిని తెరిచి చూడగా.. బాలిక కనిపించింది. రక్త గాయాలతో సూట్కేసులో అపస్మారక స్థితిలో బాలికను తండ్రి హుటాహుటిన సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. బాలిక అప్పటికే మరణించిందని వైద్యులు చెప్పారు. దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, బాలిక మృతదేహం దొరికిన ఇంట్లోని వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉండగా... వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.