రూ.200 తేడా ఉందని 93 కోట్ల ఖాతాను నిలిపేస్తారా?
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:56 AM
హేతుబద్ధత లేకుండా ఖాతాలను నిలిపివేస్తే జీవితాలే తారుమారవుతాయని పేర్కొంది. ఖాతాల్లో కేవలం రూ.200 మేర తేడా ఉందన్న కారణంతో రూ.93 కోట్ల ఖాతాను పూర్తిగా స్తంభింపజేయడాన్ని తప్పుపడు తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
బ్యాంకు ఖాతాల స్తంభనపై జాగ్రత్తలు అవసరం
దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సూచనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: సైబర్ నేరాలపై దర్యాప్తులో భాగంగా నిందితులు, అనుమానితుల బ్యాంకు ఖాతాలను సంపూర్ణంగా స్తంభింపజేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. హేతుబద్ధత లేకుండా ఖాతాలను నిలిపివేస్తే జీవితాలే తారుమారవుతాయని పేర్కొంది. ఖాతాల్లో కేవలం రూ.200 మేర తేడా ఉందన్న కారణంతో రూ.93 కోట్ల ఖాతాను పూర్తిగా స్తంభింపజేయడాన్ని తప్పుపడు తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ జైన్ ఆదేశాలు ఇస్తూ ‘‘తగిన కారణాలు చూపకుండా, బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడమే పరిష్కారమార్గమని అనుకుంటే.. అది సంబంధిత ఖాతాదారుల ఆర్థిక స్థితిగతుల్లో ఉపద్రవం సృష్టిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. ఖాతాను మొత్తంగా స్తంభింపజేసే బదులు వివాదంలో ఉన్న మొత్తాన్ని ధరావతు రూపంలో పక్కనపెడితే ఖాతాదార్లకు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.
కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా సొమ్ము భద్రంగా ఉందన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి తరహాలో పలు కేసులు వస్తున్నందున బ్యాంకు ఖాతాల స్తంభనపై ఏకరూప విధానాన్ని రూపొందించాలని కేంద్ర హోం శాఖను ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరిపి మార్గదర్శకాలు, ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ ఎలాంటి సైబర్ కేసులో నిందితుడుగానీ, అనుమానితుడుగానీ కాదని, కానీ మొత్తం ఖాతాను స్తంభింపజేశారని తెలిపారు. నేరంతో ఎలాంటి సంబంధం లేకపోయినా, అనుకోకుండా లబ్ధి పొంది ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మరిన్ని తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: గిన్నిస్ రికార్డులు సృష్టించిన మహాకుంభ మేళ
Also Read: ప్యూర్ ఈవీ వినియోగదారులకు బంపర్ ఆఫర్
For National News And Telugu News