Vizag Steel Plant: స్టీల్ప్లాంటు పరిరక్షణకు తెలుగు ప్రజలు పోరాటం చేయాలి
ABN , Publish Date - May 27 , 2025 | 05:45 AM
విశాఖ స్టీల్ప్లాంటులో 3,000 కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని సీపీఎం నేత రాఘవులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంద్రం ప్రైవేటీకరణ వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు.
బీవీ రాఘవులు
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ముందస్తు పథకం ప్రకారమే విశాఖ స్టీల్ప్లాంటు కార్మికులను తొలగిస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంటులో మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగితే, యాజమాన్యంతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఉద్యోగం నుంచి తొలగించినవారికి ఎలాంటి పరిహారం అందజేయకపోవడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కాంట్రాక్టు కార్మికుల్లో నిర్వాసితులు కూడా ఉన్నారని, వారిని రోడ్డునపడేయడం అన్యాయమన్నారు. అనకాపల్లి జిల్లాను స్టీల్హబ్గా తయారుచేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నారని, కానీ విశాఖలో ఉన్న స్టీల్ప్లాంటును నాశనం చేయడం ఎంతవరకు న్యాయమని రాఘవులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా ప్రైవేటుకు అప్పగించే వ్యూహం కేంద్రప్రభుత్వం అమలుచేస్తోందని ఆరోపించారు. స్టీల్ప్లాంటు భూములను కూడా ప్రైవేటుకు ఇచ్చే ఉద్దేశం కనిపిస్తున్నందున దానిని అడ్డుకోవడంతోపాటు కర్మాగారానికి సొంత గనులు కేటాయించేలా తెలుగు ప్రజలంతా పోరాటం చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్మెన్ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్కు షాక్
ఆపరేషన్ సిందూర్పై ముందుగానే పాక్కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News