BLO Remuneration-EC: బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:03 AM
ఓటర్ జాబితా సంబంధిత విధుల్లో పాల్గొనే బీఎల్ఓ, సూపర్వైజర్ల పారితోషికాన్ని ఈసీ పెంచింది. ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు హానరేరియమ్ను కూడా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితాకు సంబంధించిన విధుల్లో పాల్గొనే బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్ఓ), సూపర్వైజర్లకు పారితోషికాన్ని ఎన్నికల సంఘం పెంచింది. ప్రస్తుతం ఒక ఎలక్షన్ సైకిల్లో బీఎల్ఓకు రూ.6000, సూపర్వైజర్కు రూ.12000 చొప్పున ఈసీ చెల్లిస్తోంది. 2015 నుంచి ఇదే పారితోషికం అమల్లో ఉంది. వీటిని ఈసీ తాజాగా సవరించింది. బీఎల్ఓ పారితోషికాన్ని రూ.12 వేలకు పెంచింది. ఇక సూపర్వైజర్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.18 వేలకు పెంచింది (BLO Remuneration Doubled - EC).
ఇక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (ఏఈఆర్ఓ) సేవలకు గుర్తింపుగా ఇకపై హానరేరియమ్ను ఇచ్చేందుకు ఈసీ నిర్ణయించింది. ఈఆర్ఓకు రూ.30 వేలు, ఏఈఆర్ఓకు రూ.25 వేలు ఇస్తామని ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి పునాది అని ఈసీ తన ప్రకటలో పేర్కొంది. ఈ విధుల్లో పాల్గొనే ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలు ఎంతో శ్రమిస్తారని చెప్పింది. ఎన్నికలు నిష్పాక్షికంగా పారదర్శకంగా నిర్వహించడంలో ఈ సిబ్బంది పాత్ర కీలకమని ప్రశంసించింది. ఈ నేపథ్యంలో బీఎల్ఓలు, సూపర్వైజర్లకు ఇచ్చే పారితోషికాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఈఆర్ఓ, ఏఈఆర్ఓలకు హానరేరియమ్ను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది.
ప్రస్తుతం ఎన్నికల సంఘం రెండో దశ ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 12 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. తుది ఓటర్ జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈసీ విడుదల చేస్తుంది. తొలి దశ సవరణ బిహార్ ఎన్నికల నాటికి ముగిసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్
ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితులకు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి