Share News

Bihar Elections: ఏడీఆర్ నివేదిక.. బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఎవరంటే?

ABN , Publish Date - Oct 15 , 2025 | 10:14 AM

శాసనసభ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సమగ్ర నివేదిక రూపొందించింది. బిహార్‌లోని 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. మొత్తం 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194 మంది కోటీశ్వరులని నివేదిక స్పష్టం చేసింది.

Bihar Elections: ఏడీఆర్ నివేదిక.. బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఎవరంటే?
Bihar Elections

పట్నా, అక్టోబర్ 15: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఊపందుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు నిమగ్నమవగా.. ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. శాసనసభ ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సమగ్ర నివేదిక రూపొందించింది. బిహార్‌లోని 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. మొత్తం 241 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 194 మంది కోటీశ్వరులని నివేదిక స్పష్టం చేసింది. వీరందరి ఆస్తులు రూ.1,121 కోట్లు దాటాయని వివరించింది. జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నీలం దేవి రూ.80 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్నరాలైన ఎమ్మెల్యేగా నివేధిక స్పష్టం చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా రూ.70 వేలతో నిరుపేద ఎమ్మెల్యే అని తెలిపింది.


పార్టీల పరంగా ఎమ్మెల్యేల ఆదాయ వివరాలు వెల్లడించింది. బీజేపీలోనే అత్యధిక శాతం సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించింది. బీజేపీ పార్టీకికి ఉన్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 83 మంది కాగా.. వీరిలో 72 మంది (87 శాతం ) ధనిక ఎమ్మెల్యేలు అని తేల్చింది. ఆర్జేడీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా వీరిలో 63 మంది 88 శాతం కోటీశ్వరులని తేల్చింది. ఇక జేడీయూ పార్టీలో ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83 శాతం) మంది ఎమ్మెల్యేలు రిచెస్ట్ ఎమ్మెల్యేలు అని తెలిపింది.


బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అసెంబ్లీ ఎన్నికల తొలి దశ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం 121 నియోజకవర్గాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఓట్లు లెక్కిస్తారు. తొలి దశ పోలింగ్‌కు సంబంధించి.. ఉత్తర, దక్షిణ బీహార్‌లోని 18 జిల్లాల్లోని 121అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరిగే ఈ పోరులో ముఖ్యంగా ఎన్‌డీఏలో బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ కలిసి పోరాడుతుంటే.. మహాఘట్‌బంధన్ నుంచి ఆర్‌జేడీ, కాంగ్రెస్ కలిసి.. గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగియనుండటంతో తాజాగా ఎన్నికలు జరుగనున్నాయి.


బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆరుగురు అభ్యర్థులను హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మంగళవారంప్రకటించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న హెచ్ఏఎంకు 6 సీట్లు కేటాయించారు. దీంతో మొత్తం ఆరు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ సైతం 71 మంది అభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 101 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మాజీ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి తదితరులు ఉన్నారు. కాగా, 8 మంది మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు లభించడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2025 | 10:14 AM