Amit Shah: చొరబాటుదార్లకు కొన్ని పార్టీలు కొమ్ముకాస్తున్నాయి.. హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:17 PM
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు కొన్ని పార్టీలు అడ్డుపడుతూ చొరబాటుదార్లకు కొమ్ముకాస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశ భద్రతకు, ప్రజాస్వామ్య రక్షణకు ఎస్ఐఆర్ అవసరమని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మరి కొన్ని నెలల్లో పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా సవరణకు అడ్డుపడుతూ కొన్ని పార్టీలు చొరబాటుదార్లకు కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు (Amit Shah on SIR in West Bengal).
‘చొరబాట్లను అడ్డుకోవడం దేశ రక్షణకే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ కలుషితం కాకుండా జాగ్రత్త పడేందుకు అవసరం. దురదృష్టవశాత్తూ కొన్ని పార్టీలు ఈ చొరబాటుదార్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ జాబితా ప్రక్షాళనను వారు వ్యతిరేకిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణను తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఆందోళనకారక స్థాయికి చేరుకుందని అన్నారు. ఎలాంటి ప్లాన్ లేకుండా ప్రమాదకరంగా సవరణలు చేపడుతున్నారని విమర్శించారు. దీని వల్ల తొలి రోజు నుంచే వ్యవస్థ మొత్తం కుంటుపడిందని విమర్శించారు.
కనీస సంసిద్ధత, ప్రణాళిక, స్పష్టమైన సమాచారం ఇచ్చిపుచ్చుకోకుండా చేపడుతున్న సవరణల వల్ల మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ఎస్ఐఆర్ను బలవంతంగా ప్రజలపై రుద్దుతున్నారని కామెంట్ చేశారు. సిబ్బందికి శిక్షణ కూడా సరిగా లేదని అన్నారు. బతుకుతెరువు కోసం శ్రమ పడుతూ బిజీగా ఉండే వారిని కలుసుకోవడం బూత్ లెవెల్ ఆఫీసర్లకు దాదాపు అసాధ్యంగా మారిందని అన్నారు. వారి ప్రధాన విధులతో పాటు ఓటర్ జాబితా బాధ్యతలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. సవరణకు సంబంధించిన డాక్యుమెంట్స్పై కూడా తికమక నెలకొందని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్లో ఎన్కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి