Air India Emergency Landing: ఎయిరిండియాపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:31 AM
తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా చెన్నైలో అత్యవసరంగా దించిన ఘటనలో...
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఐదుగురు ఎంపీల లేఖ
న్యూఢిల్లీ, ఆగస్టు 12: తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా చెన్నైలో అత్యవసరంగా దించిన ఘటనలో ఎయిరిండియా తీవ్ర హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సహా ఐదుగురు ఎంపీలు ఆరోపించారు. ఈ ఘటనపై వారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మంగళవారం లేఖ రాశారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఎయిరిండియాపై చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో కోరారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కే సురేశ్, ఆడూర్ ప్రకాశ్, రాబర్ట్ బ్రూస్, సీపీఎం ఎంపీ కే రాధాకృష్ణన్తోపాటు 150 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా దారి మళ్లించి చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్నాయుడుకు ఫిర్యాదు చేసిన ఐదుగురు ఎంపీలు.. తాజాగా ఓం బిర్లాకు కూడా లేఖ రాశారు.