Pahalgam Attack: కాందహార్ సూత్రధారి రవూఫ్ హతం
ABN , Publish Date - May 09 , 2025 | 05:43 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్కు మరో విజయం అందింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరుడు, కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి అబ్దుల్ రవూఫ్ అజర్ భారత సైన్యాల ఆధ్వర్యంలో మరణించాడు.

జైషే అధినేత మసూద్కు రవూఫ్ సోదరుడు
పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీసుకున్న భారత్కు మరో భారీ విజయం కూడా లభించింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తమ్ముడు, కాందహార్ విమానం హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజర్ ఈ దాడుల్లో మరణించాడు. భారత సైన్యం, వాయుసేన సంయుక్తంగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల శిక్షణ, ఆయుధ శిబిరాలు, ప్రధాన కార్యాలయాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మరణించి న 10 మంది మసూద్ అజర్ కుటుంబసభ్యుల్లో రవూఫ్ అజర్ కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం కాగా, అధికార వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ 18 మీడియా సంస్థ దీనిపై ఓ కథనం ప్రచురించింది. ఆపరేషన్ సిందూర్లో నేలమట్టమైన బహావల్పూర్లోని జైషే ప్రధాన స్థావరం మ ర్కజ్ సుబాన్ కాంప్లెక్స్పై జరిపిన దాడిలో రవూఫ్ అజర్ మరణించాడు.
నేపాల్లో అపహరించి.. కాందహార్లో దింపి..
1999లో నేపాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన రవూఫ్ అజర్ దాన్ని అఫ్ఘానిస్థాన్లోని కాందహార్లో దింపి ప్రయాణికులను అడ్డుపెట్టుకుని భారత్తో చర్చలు జరిపాడు. భారతీయ జైళ్లలో ఉన్న తన సోదరుడు మసూద్ అజర్, అల్కాయిదా ముఖ్యనేత ఒమర్ సయీద్ షేక్ సహా పలువురు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ పెట్టాడు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ జైళ్లలోని ఉగ్రవాదులను తన వెంటపెట్టుకునిపోయి కాందహార్లో వారిని హైజాకర్లకు అప్పగించారు.