Share News

New York : అక్రమ వలసదారుల కోసం.. గురుద్వారాల్లోనూ తనిఖీలు

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:33 AM

అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తున్న అమెరికా.. ఆ వేటలో భాగంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. సిక్కు వేర్పాటువాదులు, అక్రమ వలసదారులు, సరైన

New York : అక్రమ వలసదారుల కోసం.. గురుద్వారాల్లోనూ తనిఖీలు

న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో అధికారుల వేట.. ట్రంప్‌ సర్కారుపై సిక్కు సంస్థల మండిపాటు

న్యూయార్క్‌, జనవరి 27: అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తున్న అమెరికా.. ఆ వేటలో భాగంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. సిక్కు వేర్పాటువాదులు, అక్రమ వలసదారులు, సరైన పతాల్రు లేనివారు ఆ గురుద్వారాలను తమ హబ్‌గా మార్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా అంతర్గత భద్రత శాఖ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. నిజానికి.. ప్రార్థనామందిరాలు, పాఠశాలల వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ), కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకుండా బైడెన్‌ హయాంలో నియంత్రణలు విధించారు. కానీ, ట్రంప్‌ సర్కారు ఆ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఆయా విభాగాల అధికారులు ప్రార్థనా మందిరాలనూ వదలకుండా సోదాలు చేస్తున్నారు. ‘‘ఇకపై నేరగాళ్లు పోలీసులకు దొరక్కుండా ఉండడానికి అమెరికాలోని పాఠశాలలు, చర్చిల్లో దాక్కోలేరు’’ అని ఆ విభాగం అధికార ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. కాగా.. గురుద్వారాల్లోకి అధికారులను పంపిస్తున్న ట్రంప్‌ సర్కారుపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. ఈ తరహా చర్యలు తమ మత విశ్వాసానికి, గురుద్వారాల పవిత్రతకు ముప్పుగా పరిణమిస్తాయని ‘సిఖ్‌ అమెరికన్‌ లీగల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌’ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా గురుద్వారాల్లో సోదాలు చేస్తున్నట్టు తెలిస్తే వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుందని, దానివల్ల తమ మతవిశ్వాసాలకు సంబంధించిన ప్రక్రియలను అర్థవంతంగా నిర్వహించుకోలేని పరిస్థితి వస్తుందని ఆగ్రహం వెలిబుచ్చింది.


వాణిజ్య యుద్ధానికి భయపడి..

‘‘మా దేశానికి చెందినవారిని అమెరికా నుంచి అక్రమ వలసదారుల పేరుతో సైనిక విమానాల్లో పంపిస్తారా..’’ అంటూ అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసి, రెండు విమానాలను తిరస్కరించిన కొలంబియా దేశం ఒక్కరోజు కూడా గడవక ముందే మాట మార్చింది. అగ్రరాజ్యం తమ దేశంపై వాణిజ్య యుద్ధానికి దిగేందుకు సిద్ధం కావడంతో.. అమెరికా చెప్పినట్టు నడుచుకోవడానికి సిద్ధమైంది. మాస్‌డీపోర్టేషన్‌లో భాగంగా అమెరికా ఆదివారం ఉదయం రెండు సైనిక విమానాల్లో అక్రమ వలసదారులను కొలంబియాకు పంపించింది. ఆ విమానాలు రావడానికి తొలుత అన్ని అనుమతులూ ఇచ్చిన కొలంబియా.. అవి దారిలో ఉండగా ఆ అనుమతులను ఉపసంహరించుకుంది. దీంతో ట్రంప్‌.. కొలంబియా దిగుమతులపై 25ు సుంకాలు విధిస్తామని.. మరో వారంలో ఆ సుంకాలను 50 శాతానికి పెంచేస్తానని హెచ్చరించారు. కొలంబియా నుంచి అమెరికాకు ఎవరూ రాకుండా ప్రయాణ నిషేధాన్ని విధిస్తానన్నారు. ఇప్పటికే అమెరికాలో ఉన్న కొలంబియన్‌ ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబసభ్యులు, మద్దతుదారుల వీసాలను రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో, కొలంబియా సర్కారు వెనక్కి తగ్గింది. అమెరికా నుంచి సైనిక విమానాల రాకకు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి లూయిస్‌ గిల్బెర్టో అధికారికంగా వెల్లడించారు. దీన్ని ట్రంప్‌ విజయంగా వైట్‌హౌస్‌ అభివర్ణించింది.



ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 06:33 AM