Share News

డ్రోన్లే కాదు.. సైనికులనూ పంపిన తుర్కియే!

ABN , Publish Date - May 15 , 2025 | 05:20 AM

భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లను ఇవ్వడంతోపాటు తమ దేశ సైనికులను కూడా తుర్కియే పంపిన విషయం బట్టబయలైంది.

డ్రోన్లే కాదు.. సైనికులనూ పంపిన తుర్కియే!

భారత్‌పై దాడికి ఆ దేశం సాయం.. ‘సిందూర్‌’లో ఇద్దరు తుర్కియే సైనికుల మరణమే నిదర్శనం

  • మంచిచెడుల్లోనూ పాకిస్థాన్‌కు తోడుంటాం: ఎర్డోగాన్‌

న్యూఢిల్లీ, మే 14: భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లను ఇవ్వడంతోపాటు తమ దేశ సైనికులను కూడా తుర్కియే పంపిన విషయం బట్టబయలైంది. ఆపరేషన్‌ సిందూర్‌లో ఇద్దరు తుర్కియే సైనికులు హతమయ్యారు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్థాన్‌కు 350కిపైగా డ్రోన్లు ఇచ్చిన తుర్కియే.. సైనికులను కూడా పాకిస్థాన్‌కు పంపినట్టు ఇది నిరూపిస్తోందని అధికార వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి. ఆ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌పై డ్రోన్‌ దాడులను సమన్వయం చేసుకోవడంలో పాకిస్థాన్‌ ఆర్మీ అధికారులకు తుర్కియే సలహాదారులు సాయం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో రాత్రివేళ భారత్‌పైకి 300 నుంచి 400 డ్రోన్లను పాకిస్థాన్‌ ఆర్మీ ప్రయోగించింది. ఈ డ్రోన్ల శకలాలకు ఫోరెన్సిక్‌ దర్యాప్తు నిర్వహించగా, అవి తుర్కియేకు చెందిన అసి్‌సగార్డ్‌ సొంగార్‌ డ్రోన్లని ప్రాథమికంగా తేలింది. ఈ విషయాన్ని ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా సమావేశంలో కల్నల్‌ సోఫియా ఖురేషీ కూడా చెప్పారు. భారత్‌పై దాడికి తుర్కయే సాయం చేయడంపై భారతీయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నా తుర్కియే అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆయన బుధవారం పాకిస్థాన్‌కు మద్దతును పునరుద్ఘాటించారు. పాకిస్థాన్‌ను సోదరదేశంగా ఆయన ప్రస్తావించారు. మంచి, చెడ్డ సమయాల్లోనూ పాక్‌ పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు బలమైన మద్దతు, అచంచలమైన సంఘీభావం తెలియజేశారంటూ ఎర్డోగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ‘ఎక్స్‌’లో చేసిన పోస్టుకు స్పందనగా ఎర్డోగన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


తుర్కియేకు మేం వెళ్లం

బాయ్‌కాట్‌ తుర్కియే, అజర్‌బైజాన్‌ నిరసన దేశంలో ఊపందుకుంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన ఆ దేశాలపై భారతీయుల ఆగ్రహం కొనసాగుతోంది. పహల్గాం దాడులకు ముందు ఆ రెండు దేశాల్లో పర్యటనలకు సిద్ధపడ్డ భారతీయులు.. ఇప్పుడు ఆ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 చానల్‌తో మాట్లాడుతూ ఈజ్‌మైట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టి ధ్రువీకరించారు. గతకొద్ది రోజులుగా భారత్‌ నుంచి పర్యాటక ట్రిప్పులు భారీగా రద్దు అవుతున్నాయని ఆయన తెలిపారు. తుర్కియేకు 22ు, అజర్‌బైజాన్‌కు 30శాతానికి పైగా తమ సంస్థ ద్వారా ట్రిప్పులు రద్దు అయ్యాయని చెప్పారు. ఆ రెండు దేశాలతో పాటు చైనాకు కూడా ట్రిప్పులు రద్దు చేసినట్లు ఇక్సిగో సీఈవో అలోకి చెప్పారు.

Updated Date - May 15 , 2025 | 05:20 AM