Share News

Retaliatory Tariffs: 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:16 AM

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళవారం అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్‌.. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు.

Retaliatory Tariffs: 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు

దక్షిణ కొరియా, యూరప్‌ దేశాలపై కూడా పన్నులు విధిస్తాం

అమెరికా కాంగ్రెస్‌ సమావేశంలో ట్రంప్‌

ఆటో ఉత్పత్తులపై ఇండియా 100ు

కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోందని ఆగ్రహం

శత్రుదేశాలే కాక మిత్రదేశాలూ అమెరికాను

దశాబ్దాలుగా దోచుకుంటున్నాయని ధ్వజం

వేరే మార్గాల్లో తమ ఉత్పత్తుల్ని నియంత్రిస్తే

తామూ అలాగేచేస్తామని తేల్చిచెప్పిన ట్రంప్‌

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, మార్చి 5: భారత్‌ సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి పరస్పర (ప్రతీకార) సుంకాలు విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన మంగళవారం అమెరికన్‌ కాంగ్రెస్‌ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. అందులో పలు అంశాల గురించి ప్రస్తావించిన ట్రంప్‌.. శత్రు దేశాలే కాక మిత్ర దేశాలు సైతం అమెరికాపై అన్యాయంగా సుంకాలు విధిస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘పలు దేశాలు కొన్ని దశాబ్దాలుగా మనపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయి. ఇప్పుడిక మనవంతు. యూరోపియన్‌ దేశాలు, చైనా, బ్రెజిల్‌, ఇండియా, మెక్సికో, కెనడా, ఇంకా బోలెడన్ని దేశాలు మనం వారిపై విధిస్తున్న సుంకాల కన్నా మనపై ఎక్కువగా వేస్తున్నాయి. ఇది అన్యాయం. భారతదేశం మన ఆటో ఉత్పత్తులపై 100 శాతం కన్నా ఎక్కువ సుంకాలు వేస్తోంది’’ అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మన ఉత్పత్తులపై చైనా సగటు సుంకాలు.. మనం వారిపై విధిస్తున్న దానికన్నా రెట్టింపుస్థాయిలో ఉన్నాయి.

tg.jpg

దక్షిణ కొరియా సుంకాలైతే ఏకంగా నాలుగు రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఒక్కసారి ఆలోచించండి.. నాలుగు రెట్లు అధికం. మనమేమో అదే దక్షిణ కొరియాకు సైనిక సాయం చేయడంతోపాటు రకరకాలుగా అండగా ఉంటున్నాం. కానీ, జరుగుతోంది ఏమిటి?.. వారు మనపై అధిక సుంకాలు విధిస్తున్నారు. మన మిత్రులు, శత్రువులు అందరూ ఇదే చేస్తున్నారు.


ఈ భూమ్మీద దాదాపు ప్రతిదేశమూ దశాబ్దాలుగా అధిక సుంకాలతో మనల్ని దోచుకుతింటోంది’’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇకపై అలా జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. ‘‘మీరు మీ ఉత్పత్తులను అమెరికాలో తయారుచేయకపోతే.. ట్రంప్‌ పాలనలో మీరు సుంకాలను, కొన్ని సందర్భాల్లో అధిక సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆయా దేశాలను హెచ్చరించారు. ‘‘ఇతర దేశాలు మాపై ఏస్థాయిలో సుంకాలు విధిస్తే.. మేమూ అలాగే విధిస్తాం. వారు మనల్ని తమ మార్కెట్లకు దూరంగా ఉంచే ఉద్దేశంతో నాన్‌-మానెటరీ టారిఫ్స్‌ (డబ్బు రూపంలో కాకుండా.. విధానపరమైన నిర్ణయాల ద్వారా నియంత్రించడం) విధిస్తే మనం కూడా వారిని మన మార్కెట్లకు దూరంగా ఉంచడానికి అలాగే చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. తాను ఇదే పనిని చైనాతో, ఇతర దేశాలతో కూడా చేశానని.. ఇంతకుముందున్న బైడెన్‌ పాలనలో ఇలా చేయలేకపోయారని స్వీయ కితాబు ఇచ్చుకున్నారు. మెక్సికో, కెనడాల విషయానికి వస్తే.. వాణిజ్యపరంగా ఎంతో లోటు ఉందని, ఆయా దేశాలు అమెరికాకు అధికంగా ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ, తాము మాత్రం తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయని విమర్శించారు. ఆ విషయాన్ని పక్కనపెడితే.. ‘‘ఆయా దేశాలు మన దేశంలోకి ఫెంటైనిల్‌ రాకను మునుపెన్నడూ లేని విధంగా అనుమతిస్తున్నాయి. అది మన దేశానికి చెందిన యువతీయువకులను వేలు, లక్షల సంఖ్యలో చంపేస్తోంది. కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. అందుకు బదులుగా ఆ రెండు దేశాలూ అమెరికా నుంచి వందల కోట్ల డాలర్లు రాయితీ రూపంలో పొందుతున్నాయి. ఇకపై అలా జరగనివ్వం’’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తాను ఈ సుంకాల విధింపును ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేద్దామనుకున్నప్పటికీ.. అంతా ‘ఏప్రిల్‌ ఫూల్స్‌ డే’ అని ఎగతాళి చేసే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి తెస్తున్నానన్నారు.


గ్రీన్‌లాండ్‌ను కలిపేసుకుంటాం: ట్రంప్‌

అమెరికాలో కలిసిపోవాలని గ్రీన్‌లాండ్‌ను ట్రంప్‌ మళ్లీ కోరారు. అమెరికా కాంగ్రె్‌సను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ట్రంప్‌ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఆయన ప్రతిపాదనను డెన్మార్క్‌ వెంటనే తిరస్కరించింది. గ్రీన్‌లాండ్‌ అమెరికాలో కలవడం జరగదని డెన్మార్క్‌ రక్షణ మంత్రి ట్రూల్స్‌ లండ్‌ పౌల్సెన్‌ స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్‌ ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. గ్రీన్‌లాండ్‌లో సాధారణ ఎన్నికలు జరగడానికి వారం రోజుల ముందు.. ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తక్కువ జనాభా ఉన్న, భారీగా ఖనిజ సంపద ఉన్న గ్రీన్‌లాండ్‌ ద్వీపంలోని అత్యద్భుత ప్రజలకు ఒక సందేశం ఇస్తున్నానన్న ట్రంప్‌.. ‘‘మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకొనే హక్కుకు మేం మద్దతిస్తాం. మీరు యూఎ్‌సఏలో కలవాలనుకుంటే సాదరంగా ఆహ్వానిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 05:16 AM