Maria Corina Machado: వెనెజువెలా ఉద్యమకారిణికినోబెల్ శాంతి
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:22 AM
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి...
ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న
మరియా కొరినాకు దక్కిన పురస్కారం
‘బుల్లెట్లకు బదులు బ్యాలెట్లు’ నినాదంతో వెనెజువెలాలో ఉద్యమం
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల కోసం 20 ఏళ్లుగా పోరాటం
నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసిన ధీశాలి
ప్రాణాలకు ముప్పు ఉన్నా స్వదేశంలోనే అజ్ఞాతంలో ఉంటూ పోరాటం
ట్రంప్తో సహా 338 మంది నామినేట్ అయినా వారందరిని కాదని కొరినాను ఎంపిక చేసిన నోబెల్ కమిటీ
మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకు కృతజ్ఞతలు
డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి అంకితం: మరియా మచాడో
ఆస్లో, అక్టోబర్ 10: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ఎంపికయ్యారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజల తరపున పోరాడినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వేజియన్ నోబెల్ కమిటీ తెలిపింది. చీకట్లు కమ్ముకున్న ప్రాంతంలో ప్రజాస్వామ్య జ్వాల వెలిగేలా చేస్తున్న సాహసిగా శాంతి కోసం ఆమె చేసిన విశేష కృషికి గాను ఈ పురస్కారం ఇస్తున్నట్లు పేర్కొంది. వెనెజువెలాను నియంతృత్వ దేశం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు శాంతియుత పోరాటం చేశారని కమిటీ చైర్మన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణి పెరుగుతున్న పరిస్థితుల్లో మరియా లాంటి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎంతో అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఈ ఏడాది మొత్తం 338 మంది ప్రముఖులు నామినేట్ అవ్వగా.. వారందరినీ కాదని ఈ గౌరవాన్ని మచాడో సొంతం చేసుకున్నారు. ఈ ప్రకటనతో నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాలని పదేపదే చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్కు నిరాశ తప్పలేదు.
ఎవరీ మరియా కొరినా..
ఒకప్పుడు లాటిన్ అమెరికాలో అత్యంత సుసంపన్న దేశంగా ఉన్న వెనెజువెలా, గత కొన్ని సంవత్సరాలుగా నియంతృత్వ పాలన, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, రాజకీయ అస్థిరత, మానవతా సంక్షోభం వంటి కారణాలతో కుదేలైంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ’’బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందాం’’ అంటూ మచాడో ఒకసారి చెప్పిన మాటే ఆమె శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి నినాదమైంది. ’సుమెట్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలుగా దేశంలో స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికల కోసం ఆమె పోరాటం కొనసాగించారు. అణచివేతలకు వెరవకుండా, సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం గళమెత్తారు. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వెనెజువెలా సర్కారు ఆమెను పోటీ చేయనివ్వలేదు. దీంతో ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్కు మద్దతిచ్చి, వేలాది మంది వలంటీర్లను పర్యవేక్షకులుగా నియమించారు. బెదిరింపులు, అరెస్టులు, హింస వంటి కుట్రల మధ్య కూడా ప్రతిపక్షం విజయం సాధించినట్టు సాక్ష్యాలున్నా.. అధికార పక్షం ఫలితాన్ని అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్షం భారీ నిరసనలు చేపట్టింది. దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల తర్వాత మచాడోపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి ఆమె ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వెనిజువెలా ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..