Artificial Intelligence: ఏఐ ర్యాంకింగ్స్.. మూడో స్థానంలో భారత్
ABN , Publish Date - Dec 15 , 2025 | 09:40 AM
ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక తాజాగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ సాంకేతిక అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ మేరకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ‘2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. గతంతో పోలిస్తే భారత్ నాలుగు స్థానాలు పైకి ఎగబాకింది. ఏఐ(Artificial Intelligence)కి సంబంధించి ‘పరిశోధన-అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు’ వంటి అంశాల ఆధారంగా గతేడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని..స్టాన్ఫోర్డ్ వివిధ దేశాలకు తాజాగా ర్యాంకులను ప్రకటించింది.
తొలి మూడు ఏవంటే..?
ఈ నివేది ప్రకారం.. ఏఐ పురోగతిలో అమెరికా 78.6 స్కోరుతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. చైనా(36.95) రెండో స్థానంలో ఉండగా.. భారత్(21.59)తో మూడో స్థానానికి చేరింది. ఈ సూచీలో సౌత్ కొరియా(17.24), యునైటెడ్ కింగ్డమ్(16.64), సింగపూర్(16.43), స్పెయిన్(16.37), యూఏఈ(16.06), జపాన్(16.04) మన కంటే దిగువనే ఉన్నాయి.
పెట్టుబడులు ఇలా..
వివిధ ప్రభుత్వాలు కూడా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాయి. కెనడా 2.4 బి.డా.(సుమారు రూ.21,600 కోట్లు), చైనా 47.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.27 లక్షల కోట్ల) సెమీకండక్టర్ నిధి, ఫ్రాన్స్ 109 బిలియన్ యూరోలు (సుమారు రూ. 11.44 లక్షల కోట్లు), భారత్ 1.25 బి.డా.(సుమారు రూ.11,250 కోట్లు), సౌదీ అరేబియా 100 బి.డా. (సుమారు రూ.9 లక్షల కోట్ల) పెట్టుబడులను ఈ రంగానికి ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్య.. తొలి భారత ప్లేయర్గా!
ఆ తప్పిదమే మా ఓటమికి కారణమైంది: కెప్టెన్ మార్క్రమ్