Elon Musk: గత వారం ఏం పని చేశారు?
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:11 AM
గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలియజేయాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం)’ నుంచి శనివారం పంపిన మెయిల్లో ఆదేశించారు.
రెండ్రోజుల్లోగా 5 పాయింట్లలో జవాబివ్వండి
అలా ఇవ్వకపోతే రాజీనామాగా పరిగణిస్తాం
అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ మెయిల్
చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాలు చేస్తాం
అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు
ఎఫ్బీఐ ఉద్యోగులెవరూ స్పందించొద్దు: కాశ్
వాషింగ్టన్, ఫిబ్రవరి 23: అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మస్క్.. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 20 లక్షల మందికి పైగా ఫెడరల్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపారు. గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలియజేయాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం)’ నుంచి శనివారం పంపిన మెయిల్లో ఆదేశించారు. సవివరమైన సమాచారం, లింకులు లేదా అటాచ్మెంట్లు పంపొద్దని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జవాబు ఇవ్వడంలో విఫలమైన వారిని రాజీనామా చేసినట్లుగానే పరిగణిస్తామని మస్క్ తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు శనివారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రత్యేక ప్రభుత్వ అధికారిగా, అధ్యక్షుడి సలహాదారుగా ఉన్న మస్క్కు ఫెడరల్ ఉద్యోగులను తొలగించే అధికారాలేమీ లేవని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని చెప్పారు.
మస్క్ పంపిన మెయిల్ చాలా క్రూరమైందన్నారు. ఆయన ఆదేశాలతో ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాలు చేస్తామని స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయతీగా ప్రజలకు సేవ చేయని మస్క్తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం అంటే వారిని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. మరోవైపు, మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. ప్రతి ఏజెన్సీ ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన మేరకే నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు. అనంతరం డోజ్ పనితీరును ట్రంప్ ప్రశంసించారు. మస్క్ చాలా మంచి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. కాగా, ‘ఈ వారంలో మీరేం పని చేశారు?’ అనే ప్రశ్న మస్క్ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా అడిగారు. 2022లో ట్విటర్ను కొనుగోలు చేసేముందు ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్కు ఇదే ప్రశ్నను సంధించారు. అనంతరం ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.
స్పందించనక్కర్లేదు: కాశ్ పటేల్
మస్క్ పంపిన మెయిల్పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)కు 9వ డైరెక్టర్గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన కాశ్ పటేల్ భిన్నంగా స్పందించారు. ఆ మెయిల్కు స్పందించవద్దని ఎఫ్బీఐ సిబ్బందికి స్పష్టం చేశారు. ‘‘ఏం పనిచేస్తున్నారో తెలియజేయాలంటూ ఓపీఎం నుంచి ఎఫ్బీఐ ఉద్యోగులకూ మెయిల్ వచ్చి ఉండొచ్చు. ఎఫ్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుతం దర్యాప్తు సంస్థలో సమీక్షల ప్రక్రియ జరుగుతోంది. ఏదైనా సమాచారం అవసరమైతే మేమే స్పందిస్తాం. ప్రస్తుతానికి ఉద్యోగులెవరూ మస్క్ మెయిల్కు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కాశ్ ఎఫ్బీఐ ఉద్యోగులకు సందేశం పంపారు. అలాగే జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎ్సఏ) కూడా.. తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎవరూ మస్క్ మెయిల్కు స్పందన తెలియజేయనక్కర్లేదని ఉద్యోగులకు సందేశం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి...
CM Stalin: కుటుంబ నియంత్రణతో లోక్సభ సీట్లు తగ్గే అవకాశం: స్టాలిన్ ఆందోళన
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.