ChatGPT: చాట్జీపీటీ వినియోగంలో భారత్ టాప్
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:02 AM
ప్రపంచంలో ఏఐ వినియోగంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు. చాట్జీపీటీ వినియోగంలో భారత్ 13.5%తో మొదటి స్థానంలో నిలవగా, అమెరికా 8.9%తో రెండో స్థానంలో ఉంది. చైనా తయారు చేసిన డీప్సీక్ వినియోగంలోనూ భారతదేశం మూడో స్థానంలో ఉంది. భవిష్యత్తు పూర్తిగా కృత్రిమ మేధ ఆధారితంగా మారనున్నదని తాజా నివేదికలు సంకేతాలిస్తున్నాయి.
అమెరికాను దాటి అగ్రస్థానంలోకి..
అంతర్జాతీయ వినియోగదారుల్లో
13.5 శాతం మంది భారత్లోనే
వాషింగ్టన్, జూన్ 3: కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని ఏలుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతటా ఏఐ శకం నడుస్తోంది. ఏఐ వాడకంలో భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ముఖ్యంగా చాట్జీపీటీ వినియోగంలో భారత్ అమెరికాను దాటేసింది. మొత్తం ప్రపంచ వినియోగదారుల్లో భారతీయులు 13.5 శాతం ఉన్నారు. ఏఐ చాట్బాట్ అయిన చాట్జీపీటీ నెలవారీ క్రియాశీల వినియోగదారుల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో అమెరికా 8.9 శాతం, ఇండోనేసియా 5.7 శాతం ఉన్నాయి. చాట్జీపీటీ మాత్రమే కాదు.. చైనా రూపొందించిన డీప్సీక్ వినియోగంలోనూ భారతీయులు దూసుకెళ్తున్నారు. డీప్సీక్ మొత్తం వినియోగదారుల్లో 6.9 శాతంతో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచారు. 33.9 శాతం వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో నిలవగా.. 9.2 శాతం యూజర్లతో రష్యా రెండో స్థానంలో ఉంది. ఈ వివరాలను ప్రముఖ విశ్లేషకురాలు మేరీ మీకర్ తన ‘2025 ట్రెండ్స్’ నివేదికలో వెల్లడించారు. భవిష్యత్తు మొత్తం ఏఐదేననడానికి ఇదో సంకేతమని పేర్కొన్నారు.
చాట్జీపీటీ వచ్చిన తొలి రెండేళ్లలోనే ఏటా 35000 కోట్ల సెర్చ్లు చేశారని.. గూగుల్కు ఈ సంఖ్యను చేరుకోవడానికి 11 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. ‘‘నెట్ వినియోగదారులు కేవలం సమాధానాలు మాత్రమే కోరడం లేదు. వారు సమగ్ర సారాంశాన్ని కోరుకుంటున్నారు. దశాబ్దాకాలం పట్టే సెర్చ్ లెర్నింగ్ ప్రక్రియను చాట్జీపీటీ కొన్ని నెలలకు పరిమితం చేసింది’’ అని గ్రేహౌండ్ రిసెర్చ్ సీఈవో విర్ గాగియా పేర్కొన్నారు. అయితే, కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు జనరేటివ్ ఏఐ చాలా బాగా ఉపయోగపడుతోందని, కానీ చాలా సెర్చ్లకు దాన్ని వాడాల్సిన అవసరం లేదని కౌంటర్పాయింట్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ మోహిత్ అగర్వాల్ అన్నారు.తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news