Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం
ABN , Publish Date - Nov 06 , 2025 | 07:43 AM
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది. దీంతో మరో గంటలో పోలింగ్ జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తంగా 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగ్లో పలువురు కీలకనేతలు.. ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖులు పోటీ చేస్తున్నారు.
5 కొట్ల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్)ఇప్పటికే పంపించింది. ర్యాంపులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, షెడ్, సైన్లాంగ్వేజ్ ఇంటర్ప్రైటర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచింది ఎన్నికల సంఘం.
ప్రజలకు అందుబాటులో ఉండేలా మొత్తం 50,000కి పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,000కి పైగా మహిళల కోసం పని చేసే ప్రత్యేక బూత్లు ఉన్నాయి. ఓటర్ ఐడీ కార్డ్ (ఈపీఐసీ)లేకపోతే.. ఆధార్, పాన్, పెన్షన్ కార్డ్, డ్రైవర్ లైసెన్స్ వంటి 11 పత్రాలు ఉపయోగించుకునే అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం.
మొదటి దశలో ఎన్నికలు జరిగే 18 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2 లక్షల మంది పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు మొత్తం 50,000 మందికి పైగా మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ చేస్తున్నారు.