Private Universities: దోపిడీకి నిలయాలు ఈ ప్రైవేట్ వర్సిటీలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 06:05 AM
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జనవరి 2023 నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం దేశ్యాప్తంగా 633 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నవి. ఇందులో మన రాష్ట్రంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు 5, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 10 ఉన్నవి...
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జనవరి 2023 నాటికి వెల్లడించిన వివరాల ప్రకారం దేశ్యాప్తంగా 633 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నవి. ఇందులో మన రాష్ట్రంలో డీమ్డ్ విశ్వవిద్యాలయాలు 5, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు 10 ఉన్నవి. ఉన్నత విద్యలో ప్రైవేట్ యాజమాన్యాల నమోదును పెంచడానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహాన్ని ఇచ్చాయి. అయితే ఈ ప్రైవేటు వ్యవస్థలో పలు సమస్యలు నెలకొని ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో తమకు ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందిస్తున్న ప్రభుత్వాలలో ధనస్వాములతో నిండి ఉన్న వారి పక్షంగానే వ్యవహారించి ఈ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుమతులను ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం, ప్రజలు వారి వారి ఇండ్లలో లాక్ అయిన కరోనా కాలంలో, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఆ ప్రభుత్వంలో కొద్దిమంది ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా జీవోలను విడుదల చేయించి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఈ ప్రైవేటు యూనివర్సిటీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్రాంట్లను విడుదల చేస్తుంది. అందులో విశ్వవిద్యాలయానికి భూమి కేటాయింపు ఒకటి కాగా, దీనితో పాటు యూజీసీ నిర్దేశించినట్లు తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, హాస్టళ్లు, పరిపాలనా భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. అర్హత కలిగిన అధ్యాపకులు, సిబ్బందిని నియమించాలి. అయితే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో అర్హులు కాని అధ్యాపకులకు తక్కువ వేతనాలు ఇచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. వేలకొలది సీట్లు తెచ్చుకున్న ఈ యాజమాన్యాలు కోట్లాది రూపాయలను సంపాదించడమే లక్ష్యంగా లక్షల్లో డొనేషన్లు, ఫీజులను వసూలు చేస్తూ పేద, దళిత, బడుగు వర్గాలను దోచుకుంటున్నాయి.
అసలు ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం వెనుక ఉన్నది వేరే భావజాలం. కొన్ని దశాబ్దాలుగా అణగారిన కులాలు, వర్గాలు విద్యా రంగంలోకి అడుగుపెడుతున్న కారణంగా వీరికి విద్యా ఫలాలు అందరాదన్న కుట్రతో, అగ్రకుల భావజాలంతో, అన్ని కులాల్లోనూ ఉన్న ధనికులకే పరిమితం అయ్యే విధంగా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపనకు పూనుకున్నారు. బడుగులకు విద్య నేర్చుకునే అవకాశాలను ఇవ్వరాదనేది వారి ప్రత్యేక దృష్టి. బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన తొలి ఆధునిక కాలంలో గురుకులాల విద్యాస్థాపన లాంటిది. నాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు, శూద్ర వ్యవసాయ కులాలకు మాత్రమే గురుకుల విద్యను అందించినట్లుగా నేడు విశ్వవిద్యాలయాల విద్యను కూడా ధనమున్న కులాలైన కొందరికే సొంతం చేయాలన్న ఆలోచన దీని వెనుక ఉంది. అందుకే విద్యా రంగానికి నిధులను భారీ స్థాయిలో కోత పెట్టింది. దీని స్థానంలో ప్రైవేటు వ్యక్తులను విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోమని, మీకు నచ్చిన వారికి నచ్చిన విద్యను, ఆ విద్య ద్వారా వచ్చే జ్ఞానంతో ధనార్జనను కట్టబెట్టుకోమని తెగేసి చెబుతుంది.
గత కేసీఆర్ ప్రభుత్వం గానీ, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ గానీ చాలా కాలం పాటు ప్రజల్ని విద్యావంతుల్ని చేసే ముఖ్య విధిని స్వీకరించలేదు. అందుకే విస్తృతంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన చేపట్టాయి. ప్రైవేటు విద్యను ప్రాథమికం నుండి విశ్వవిద్యాలయం వరకు నిర్బంధం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రైవేట్ లేదా గ్లోబల్ విశ్వవిద్యాలయాలతో పేద, మధ్యతరగతి వర్గాలకు, కులాలకు తీవ్రం నష్టం జరుగుతుంది. ఈ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉపకార వేతనాలు అమలు ఉండవు. ఒకవేళ ఉన్నా, వారిలో కులం – వర్గం అనే కొలమానం అంతర్లీనంగా ఉంచుకొని క్రీమీలేయర్ అంశాన్ని పైకి చూపి విద్య అవకాశాలను నిరాకరించే అవకాశం ఉంటుంది.
ఈ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, మానవ రహిత ఉత్పాదతను పెంచే విభాగాలకే ప్రాధాన్యత. ఇవి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచింపచేయలేని విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది గాంధీ కలలు కన్న స్వరాజ్యం కాదు. నేటి విద్యావ్యవస్థతో విద్యార్థుల్లో సృజనాత్మకత అనేది కొరవడుతున్నది. దేశంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతున్నది. చేతివృత్తులు, వ్యవసాయ రంగం ఒకదానికి మరొకటి విడిపోని నూలు పోగుదారం వలె పెనువేసుకున్న రంగాలు. వీటికి ఆధునికతను ఆపాదించి అభివృద్ధి పరచకుండా ఈ దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించలేం.
చనగాని దయాకర్
టీపీసీసీ జనరల్ సెక్రెటరీ
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్ను అరెస్ట్
Read Latest AP News and National News