Hyderabad: రూ.29లక్షలు లూటీ చేసేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - May 30 , 2025 | 07:54 AM
నమ్మించి గొంతుకోయడమంటే బహుశా ఇదేనేమో. స్నేహం ముసుగులో మోసానికి పాల్పడ్డాడో వ్యకి. మొత్తం రూ.29లక్షలు కాజేశాడు. అయితే.. తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరక్కపొరు అన్నట్లుగా.. పాపం పండి మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..
- స్నేహం ముసుగులో నమ్మక ద్రోహం
- నమ్మకంగా పిలిచి డబ్బు దోపిడీ
- ముఠాను అరెస్ట్ చేసిన బాలాపూర్ పోలీసులు
హైదరాబాద్ సిటీ: నమ్మకంగా ఉంటూ స్నేహితుడి డబ్బును కాజేసే ప్రయత్నం చేసిన ముఠాను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్బాబు(Rachakonda CP Sudheer Babu) వివరాలను వెల్లడించారు. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన కబీర్, ఖాదర్లు స్నేహితులు. కబీర్ ఓ స్థలం కొనుగోలు కోసం తన మామ జకీర్ను రూ.29 లక్షల సాయం కోరాడు. దీంతో అతను తన కుమారుడు ఇలియాస్ ద్వారా డబ్బు పంపాడు.
ఈ సమయంలో స్థానికంగా కబీర్ లేకపోవడంతో డబ్బును తన స్నేహితుడైన ఖాదర్కు ఇవ్వాలని సూచించాడు. ఈ విషయాన్ని ముందస్తుగా ఖాదర్కు సైతం చెప్పి డబ్బును భద్రపరచమన్నాడు. దీనిని అవకాశంగా భావించిన ఖాదర్ డబ్బు కాజేసేందుకు ముంతాజ్బాగ్ ప్రాంతానికి చెందిన తన బంధువు హబీబ్ హరూన్, చాంద్రయణగుట్టకు చెందిన స్నేహితులు వర్థన్, రషీద్ఖాన్, రషికాంత్ బర్దన్లతో కలిసి పథకం పన్నాడు. పథకంలో భాగంగా డబ్బులు ఇచ్చేందుకు వస్తున్న ఇలియాస్ను ఎర్రకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి రావాలని లొకేషన్ పంపాడు.

ఇలియాస్ తన స్నేహితుడు హబీబుల్లాతో కలిసి డబ్బులు ఇచ్చేందుకు నిర్మానుష్య ప్రాంతానికి వచ్చాడు. ఖాదర్ కోసం వేచిచూస్తున్న అతనిపై పల్సర్ బైక్పై వచ్చిన రషీద్ఖాన్, రిషికాంత్లు కర్రలతో దాడి చేసి డబ్బు లాక్కొని పరారయ్యారు. ఈ దోపిడీ ఘటనపై ఇలియాస్ బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితులు ఖాదర్, హరూన్, వర్ధన్, రషికాంత్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.28.20లక్షలు, పల్సర్ బైక్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.80 వేలను దోపిడీకి సహకరించిన వారికి ఖాదర్ పంచినట్లు సీపీ తెలిపారు. మరో నిందితుడు రషీద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్కు 75 శాతం హాజరు తప్పనిసరి
Read Latest Telangana News and National News