Tesla Hiring in India: కీలక పరిణామం.. భారత్లో ఉద్యోగుల నియామకాలు ప్రారంభించిన టెస్లా!
ABN , Publish Date - Feb 18 , 2025 | 09:11 AM
భారత ఈవీ మార్కెట్లో ప్రవేశించాలనుకుంటున్న టెస్లా ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి కార్యకలాపాల కోసం ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉద్యోగ నియామకాలకు తెర తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత ఈవీ మార్కెట్లో ప్రవేశించాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెస్లా సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో సిబ్బంది నియామకాలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు లింక్డ్ఇన్ వేదికగా ప్రకటించింది.
టెస్లా ప్రకటన ప్రకారం, సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతోంది. మగిలిన పోస్టులకు నియామకాలు ముంబైలో చేపడుతోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్లా భారత్లో నియామకాలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది (Tesla Hiring In India).
TCS Salary Hike: మార్చిలో టీసీఎస్లో శాలరీ పెంపు
టెస్లా సంస్థ కొన్నే్ళ్లుగా భారత విపణిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. 40 వేల డాలర్లకు పైబడిన ఖరీదైన కార్లపై భారత్ ఇప్పటివరకూ 110 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించింది. ఇటీవల దీన్ని 70 శాతానికి తగ్గించింది.
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చైనాతో పోలిస్తే చిన్నదే అయినా టెస్లాకు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారింది. భారత్లో గతేడాది లక్ష యూనిట్ల విద్యుత్ కార్లు విక్రయం కాగా చైనాలో ఈ సంఖ్య ఏకంగా 11 మిలియన్లు. అయితే, దశాబ్దం తరువాత తొలిసారిగా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి. దీనికి చెక్ పెట్టేందుకు భారత మార్కెట్లో ఎంట్రీకి టెస్లా ప్రయత్నిస్తోందని సమాచారం.
Magellanic Cloud: మాజిల్లానిక్ క్లౌడ్ భారీ విస్తరణ ప్రణాళిక.. రూ. 400 కోట్లు, 3,500 నియామకాలు
ఇటీవల డోనాల్ట్ ట్రంప్తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్యలోటుపై దృష్టి పెట్టేందుకు అంగీకరించారు. రక్షణ రంగ కొనుగోళ్ల పెంపు, ఎఫ్-35 యుద్ధ విమానాల డీల్ వంటివి తెరపైకి వచ్చాయి. ఇక ట్రంప్ కేబినెట్లో కీలకంగా మారిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అయితే, మస్క్ వ్యక్తిగత హోదాలో మోదీని కలిశారా లేక అమెరికా ప్రభుత్వం తరుపున సమావేశమయ్యారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు, ట్రంప్ ప్రభుత్వంలో మస్క్కు ప్రాధాన్యం పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ, ప్రభుత్వ అవసరాల మధ్య సరిహద్దు రేఖ చెరిగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఇటలీ ప్రభుత్వ కమ్యూనికేషన్ కోసం స్పేస్ఎక్స్ సేవలు వినియోగించుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్తో ఇటలీ ప్రధాని సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
Read More Business News and Latest Telugu News