Stock Market: సూచీలకు భారీ నష్టాలు.. సెన్సెక్స్ 850 పాయింట్లు డౌన్..
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:13 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపూ లభించకపోవడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులకు బుధవారం నుంచి అదనపు సుంకాలు వర్తిస్తాయి.
బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపూ లభించకపోవడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులకు బుధవారం నుంచి అదనపు సుంకాలు వర్తిస్తాయి. ఈ సుంకాల నుంచి ట్రంప్ మినహాయింపు ఇస్తారని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ లేకపోవడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి (Business News).
సోమవారం ముగింపు (81, 635)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది (Sensex gains). ఒక దశలో దాదాపు 1000 పాయింట్లు కోల్పోయి 80,685 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 849 పాయింట్ల నష్టంతో 80,786 వద్ద రోజును ముగించింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 255 పాయింట్ల నష్టంతో 24, 712 వద్ద స్థిరపడింది (stock market profits).
సెన్సెక్స్లో బ్రిటానియా, ఎయిచర్ మోటార్స్, హెచ్యూఎల్, గ్రాన్యుయల్స్ ఇండియా, మారుతీ సుజుకీ షేర్లు లాభాలను ఆర్జించాయి. వోడాఫోన్ ఐడియా, కేఫిన్ టెక్, వేదాంత, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఏంజెల్ వన్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 935 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 688 పాయింట్లు కోల్పోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.68గా ఉంది.
ఇవీ చదవండి:
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్కార్ట్లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి