Share News

భారత్‌ బేఫికర్‌ పాక్‌ బేజార్‌

ABN , Publish Date - May 08 , 2025 | 04:43 AM

పహల్గాంలో తీవ్రవాదుల దాడికి ప్రతీకారంగా అపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపిన ప్రభావంతో పాక్‌ స్టాక్‌ మార్కెట్‌....

భారత్‌ బేఫికర్‌ పాక్‌ బేజార్‌

ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ కుదేలు.. ఒడుదుడుకుల్లోనూ 105 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: పహల్గాంలో తీవ్రవాదుల దాడికి ప్రతీకారంగా అపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపిన ప్రభావంతో పాక్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం కుప్పకూలింది. కరాచీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోని కేఎ్‌సఈ-100 ఇండెక్స్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో 6,500 పాయింట్లకు పైగా (దాదాపు 6 శాతం) పతనమైంది. చివరికి 3.13 శాతం నష్టంతో ముగిసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ భారీ ఒడుదుడుకులకు లోనైనప్పటికీ చివరికి లాభాల్లో ముగిసింది. ప్రారంభ ట్రేడింగ్‌లో 700 పాయిం ట్ల మేరకు క్షీణించి 80,000 కన్నా దిగజారిన సెన్సెక్స్‌ చివరికి 105.71 పాయింట్ల లాభంతో 80,746.78 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, ఆటో షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ లాభాలకు ఊతం ఇచ్చాయి. నిఫ్టీ 34.80 పాయింట్లు లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.

  • ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు తగ్గి రూ.84.77 వద్ద ముగిసింది. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి.


గతంలోనూ మన మార్కెట్లో స్వల్ప దిద్దుబాట్లే..

కార్గిల్‌ యుద్ధం, మన పార్లమెంట్‌పై తీవ్రవాదుల దాడి.. యురి, పుల్వామా ఘటనల కారణంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య గతంలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సందర్భాల్లోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం తక్కువేనని ఆనంద్‌ రాఠీ పరిశోధన బృందం నివేదిక పేర్కొంది. మన సూచీలు పరిమితంగా, స్వల్పకాలం పాటు దిద్దుబాటుకు లోనయ్యాయే తప్ప భారీగా, దీర్ఘకాలిక పతనాలను చవిచూసిన సందర్భాల్లేవని అంటోంది. మన ఆర్థిక మూలాలు బలంగా ఉండటం ఇందుకు దోహదపడిందని నివేదికలో ప్రస్తావించింది. భారత్‌-పాక్‌ మధ్య గత ఉద్రిక్తతల సమయంలో సెన్సెక్స్‌ దిద్దుబాటు 3.5-7.5 శాతం శ్రేణిలో ఉంది. ఈసారి రెండు దేశాల మధ్య యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిఫ్టీ సూచీ 5-10 శాతానికి మించి తగ్గకపోవచ్చని ఆనంద్‌ రాఠీ అంచనా వేసింది.

స్టాక్‌ ఎక్స్ఛేంజిల్లో

ముందుజాగ్రత్త చర్యలు

పాకిస్థాన్‌, పీఓకేలోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎ్‌సఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. విదేశీయులు యాక్సెస్‌ చేయకుండా తమ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేశాయి. ముఖ్యంగా పాకిస్థానీయులు సైబర్‌ దాడులకు పాల్పడకుండా నిరోధించడమే ఎక్స్ఛేంజ్‌ల ప్రధానోద్దేశం.

Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు

ఇంకా నగదే రారాజు

రూ 6 లక్షల కోట్లు ఆవిరి

Updated Date - May 08 , 2025 | 04:43 AM