Share News

ఇంకా నగదే రారాజు

ABN , Publish Date - May 07 , 2025 | 05:54 AM

డిజిటల్‌ చెల్లింపులు ఎంతగా పుంజుకున్నా మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంకా నగదు హవా కొనసాగుతోంది. గత పదేళ్లలో, చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల (నగదు) పరిమాణం 157 శాతం, ఏటీఎంల సంఖ్య 32 శాతం, బ్యాంకు శాఖల...

ఇంకా నగదే రారాజు

డిజిటల్‌ యుగంలోనూ తగ్గని కరెన్సీ జోరు

2024-25లో సగటున ఒక్కో ఏటీఎం

నుంచి రూ.1.3 కోట్ల విత్‌డ్రాయల్స్‌

టాప్‌లో ఉత్తర భారతం..

సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు ఎంతగా పుంజుకున్నా మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంకా నగదు హవా కొనసాగుతోంది. గత పదేళ్లలో, చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల (నగదు) పరిమాణం 157 శాతం, ఏటీఎంల సంఖ్య 32 శాతం, బ్యాంకు శాఖల సంఖ్య 36 శాతం పెరగడం ఇందుకు ఉదాహరణ. బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు నగదు నిర్వహణ సేవలు అందించే సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశంలోని ఒక్కో ఏటీఎం నుంచి సగటున రూ.1.3 కోట్ల నగదు ఉపసంహరణలు (విత్‌డ్రాయల్స్‌) నమోదయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.28 లక్షలు ఎక్కువ. గత ఏడాది మార్చి నాటికి చూసినా మన దేశ వినియోగదారుల చెల్లింపుల లావాదేవీల్లో 60 శాతం నగదు ద్వారానే జరిగాయి.


దక్షిణాదిలో కనిష్ఠం

దక్షిణ భారత్‌తో పోలిస్తే ఉత్తర భారత్‌లో నగదు హవా మరింత ఎక్కువగా ఉంది. నిజానికి దక్షిణ భారత్‌లో గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసే నగదు పరిమాణం వృద్ధి రేటు తగ్గింది. తమిళనాడు, తెలంగాణల్లో జీరో వృద్ధి రేటు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మైనస్‌ ఒక శాతం, కేరళలో మైనస్‌ 14 శాతం, కర్ణాటకలో మైనస్‌ రెం డు శాతం నమోదైంది. ఇదే సమయంలో బిహార్‌ లో 8 శాతం, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో 4 శాతం, ఛత్తీ్‌సగఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో 2 నుంచి 3 శాతం నగదు విత్‌డ్రాయల్స్‌ పెరిగినట్టు సీఎంఎస్‌ ఇన్ఫో నివేదిక వెల్లడించింది.


సగటు విత్‌డ్రాయల్స్‌ రూ.5,658

గత ఆర్థిక సంవత్సరం ఒక్కో వ్యక్తి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన సగటు నగదు మొత్తం రూ.5,658కు చేరింది. అంతకు ముందు సంవత్సరం (2023-24)తో పోలిస్తే ఇది 3 శాతం ఎక్కువ. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు చూస్తే కొన్ని నెలల్లో నగదు ఉపసంహరణలు 4 నుంచి 6 శాతం పెరిగాయి. ఇదే సమయం లో సగటు డిజిటల్‌ చెల్లింపులు తగ్గాయి. 2023 ప్రథమార్ధంలో రూ.1,603గా ఉన్న యూపీఐ చెల్లింపుల సగటు.. గత ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.1,478కు తగ్గింది. ఇదే సమయంలో పర్సన్‌-2-మర్చంట్‌ (పీ2ఎం) చెల్లింపులూ రూ.667 నుంచి రూ.643కు తగ్గినట్టు సీఎంఎస్‌ నివేదిక తెలిపింది.

ఇవి కూడా చదవండి:

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 07 , 2025 | 05:54 AM