రూ 6 లక్షల కోట్లు ఆవిరి
ABN , Publish Date - May 07 , 2025 | 05:51 AM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్, ఆయిల్ సహా పలు రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. దాంతో ప్రామాణిక సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో...
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో
155 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు బ్యాంకింగ్, ఆయిల్ సహా పలు రంగ షేర్లలో లాభాల స్వీకరణకు దిగారు. దాంతో ప్రామాణిక సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 315 పాయింట్లు క్షీణించినప్పటికీ, మళ్లీ కాస్త తేరుకుంది. చివరికి 155.77 పాయింట్ల నష్టంతో 80,641.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 81.55 పాయింట్లు కోల్పో యి 24,379.60 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లోని 30 నమోదిత కంపెనీల్లో 16 నష్టపోయాయి. ఎటర్నల్ స్టాక్ 3.08 శాతం నష్టంతో సూచీ టాప్ లూజర్గా మిగిలింది. టాటా మోటార్స్, ఎస్బీఐ రెండు శాతానికి పైగా తగ్గాయి. బుధవారం నాడు అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుండటంతోపాటు యూఎస్-చైనా మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ట్రేడర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని, దాంతో ప్రధాన సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.6 లక్షల కోట్లు తగ్గి రూ.421.31 లక్షల కోట్లకు (4.98 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
గత వారం ఐపీఓకు వచ్చిన విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ తన షేర్లను మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.321తో పోలిస్తే, బీఎ్సఈలో తొలి రోజు ట్రేడింగ్ పూర్తయ్యే సరికి కంపెనీ షేరు 5.76 శాతం క్షీణించి రూ.302.50 వద్దకు జారుకుంది.
5 ఐపీఓలకు సెబీ ఆమోదం: వెరిటాస్ ఫైనాన్స్, లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ సహా 5 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రతిపాదనలకు సెబీ ఆమోదం లభించింది. జాజూ రష్మీ రీఫ్రాక్టరీస్, రిగాల్ రీసోర్సెస్, అజయ్ పోలీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
మళ్లీ రూ.లక్ష చేరువలో బంగారం
ఢిల్లీలో ఒకే రోజు రూ.2,400 పెరుగుదల
వరుసగా మూడో రోజు ఎగబాకిన పసిడి మళ్లీ లక్ష రూపాయలకు చేరువైంది. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర ఒకే రోజు రూ.2,400 పెరిగి రూ.99,750కి చేరింది. కిలో వెండి రూ.1,800 పెరుగుదలతో రూ.98,500 ధర పలికింది. ట్రంప్ తాజా సుంకాలతో పాటు అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా వీటి ధరలు మళ్లీ పెరగడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశ లో 1.37 శాతం పెరిగి 3,379 డాలర్లకు చేరగా.. సిల్వర్ 33 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News