RBI Repo Rate Unchanged: వడ్డీ కోతకు ట్రంపే అడ్డు
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:36 AM
పండగ సీజన్లో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయ ని ఎదురుచూస్తున్న రుణగ్రహీతల ఆశలపై ట్రంప్ సుంకా లు నీళ్లు చల్లాయి. అమెరికా అధ్యక్షుడి అస్థిర వాణిజ్య విధానాలు, భారత్పై రెట్టింపు సుంకాల వడ్డనతో పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా...
రెపో రేటు యథాతథంగా కొనసాగింపు
ద్రవ్యోల్బణం అంచనా 3.1 శాతానికి కుదింపు
ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష
ముంబై: పండగ సీజన్లో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయ ని ఎదురుచూస్తున్న రుణగ్రహీతల ఆశలపై ట్రంప్ సుంకా లు నీళ్లు చల్లాయి. అమెరికా అధ్యక్షుడి అస్థిర వాణిజ్య విధానాలు, భారత్పై రెట్టింపు సుంకాల వడ్డనతో పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా ఈ సారి కీలక రెపోరేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణ యించింది. అలాగే, వడ్డీరేట్లపై తటస్థ దృక్పథాన్ని కూడా యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎంపీసీ తెలిపింది. వర్ష పాతం ఆశాజనకంగా ఉండడంతో పాటు పండగ సీజన్ కొనుగోళ్లు ఆర్థిక వృద్ధికి ఊతమివ్వవనున్నప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆర్బీఐ రెపోరేటును 1ు తగ్గించింది. ఈ ప్రయోజనం ఆర్థిక వ్యవస్థకు బదిలీ అయ్యే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. టారిఫ్ల అనిశ్చితి తొలిగితే, వచ్చే సమీక్షలో రెపోరేటును మరో 0.25 శాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వృద్ధి- ద్రవ్యోల్బణం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటును గతం లో అంచనా వేసిన 6.5 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అంతర్జాతీయ సవాళ్లు, అనిశ్చితులు పెరుగుతున్నప్పటికీ భారత్ స్థిర ధరలతో నిలకడగా వృద్ధి చెందుతోందని సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ సారి సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు, ధరలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తి సామర్థ్య వినియోగం పెరగడం, సానుకూల ఆర్థిక పరిస్థితులు దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు మద్దతివ్వనున్నాయని ఆర్బీఐ పేర్కొంది. దేశీయ సేవల రంగం చురుకుగా వృద్ధి చెందుతున్నదని, మున్ముందు నెలల్లో నిర్మాణం, వాణిజ్యం పుంజుకోనుందని ఆర్బీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను మాత్రం గతంలో ప్రకటించిన 3.7 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. అయితే, ఈ జూన్లో ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి జారుకున్న ద్రవ్యోల్బణం ఆర్థిక సంవత్సరాంతంలో మళ్లీ ఎగబాకి 4 శాతం దాటవచ్చునని ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించారు.

ద్రవ్యోల్బణంపై సుంకాల ప్రభావం ఉండదు
రిటైల్ ద్రవ్యోల్బణంపై అమెరికా సుంకాల ప్రభావం పెద్ద గా ఉండకపోవచ్చని మల్హోత్రా అన్నారు. ఒకవేళ అమెరికా పై భారత్ ప్రతీకార సుంకాలు విధిస్తే కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, మన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవచ్చన్నారు. వినియోగదారుల ధరల సూచీలో (సీపీఐ) 50 శాతం ఆహారోత్పత్తులేనని.. అంతర్జాతీయ పరిణామాలతో వాటి ధరలకు సంబంధం లేదన్నారు.
ట్రంప్ వ్యాఖ్యకు దీటైన స్పందన
భారత్ మృత ఆర్థిక వ్యవస్థ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యకు ఆర్బీఐ గవర్నర్ తనదైన శైలిలో స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చాలా బాగుందని, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అమెరికా కంటే భారత్ పాత్రే అధికమని ఆయన అన్నారు. ఈ సారి మన జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండవచ్చు. 2025లో ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 3 శాతంగా ఉండవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ వాటా 18 శాతంగా ఉండగా.. అమెరికా వాటా దాదాపు 11 శాతమేనని మల్హోత్రా అన్నారు. మన దేశం వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మున్ముందు ప్రపంచ వృద్ధితో మన వాటా మరింత పెరగనుందన్నారు.
ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడులకూ సిప్
చిన్న మదుపరులకు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. క్రమానుగుత పెట్టుబడి పథకాల (సిప్) ద్వారా రిటైల్ మదుపరులు ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడి పెట్టేందుకు తన రిటైల్ డైరెక్ట్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తేవాలనుకుంటోంది. ఇన్వె్స్టమెంట్, రీ-ఇన్వె్స్టమెంట్ ఆప్షన్లతో కూడిన ఆటో-బిడ్డింగ్ వసతిని రిటైల్ డైరెక్ట్ వేదిక ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తద్వారా మదుపరులు ట్రెజరీ బిల్లుల ప్రాథమిక వేలంలో ఆటోమేటిక్గా బిడ్లను సమర్పించే వెసులుబాటు లభిస్తుంది.
ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ల సెటిల్మెంట్ సరళం
మృతి చెందిన కస్టమర్లకు చెందిన బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాలను ప్రామాణీకరించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. చనిపోయిన కస్టమర్ల నామినీల క్లెయిమ్ల పరిష్కారాన్ని మరింత సరళీకరించడమే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా చర్చా పత్రాన్ని త్వరలోనే జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.
జీడీపీ, ఐఐపీ, సీపీఐకి
కొత్త ప్రామాణిక సంవత్సరం
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), వినియోగదారుల ధరల సూచీలకు (సీపీఐ) బేస్ ఇయర్ను మార్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది. జీడీపీ, ఐఐపీకి 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని, సీపీఐకి 2024ను బేస్ ఇయర్గా ప్రతిపాదించింది. ఆయా సూచీల మదింపు పద్ధతిని నవీకరించడంతో పాటు అదనపు డేటా చేర్చడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులను మరింత సూక్ష్మంగా గ్రహించేందుకు ప్రామాణిక సంవత్సరాలను కాలానుగుణంగా మార్చడం జరుగుతుందని లోక్సభకు కేంద్ర గణాంక శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం.. ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆర్బీఐ కీలక ప్రకటన.. రెపో రేటు యథాతథం..
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి