పీఎన్బీ లాభం రూ 4567 కోట్లు
ABN , Publish Date - May 08 , 2025 | 04:37 AM
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి బ్యాంకు రూ.4,567 కోట్ల నికర లాభం...

52 శాతం వృద్ధి 8 ఒక్కో షేరుపై రూ.2.9 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ కాలానికి బ్యాంకు రూ.4,567 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.3,010 కోట్లతో పోలిస్తే ఇది 52 శాతం ఎక్కువ. ఇదే సమయంలో బ్యాంకు స్థూల ఆదాయం రూ.32,361 కోట్ల నుంచి రూ.36,705 కోట్లకు చేరింది. క్యూ4లో వ్యాపా ర వృద్ధితో పాటు మాఫీ చేసిన రుణాల్లో రూ.4,926 కోట్లు వసూలు కావడం, ట్రెజరీ ఆదాయం రూ.1,157 కోట్ల నుంచి రూ.4,314 కోట్లకు చేరడం ఇందుకు ప్రధాన కారణమని పీఎన్బీ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర చెప్పా రు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంకు నికర లాభం రూ.8,245 కోట్ల నుంచి రూ.16,630 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం రూ.1,20,285 కోట్ల నుంచి రూ.1,38,070 కోట్లకు చేరింది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుపై వాటాదారులకు రూ.2.90 చొప్పున డివిడెండ్ చెల్లించాలని పీఎన్బీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
3,000 కొలువులు
వ్యాపార విస్తరణ కోసం ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా 200 శాఖలు ప్రారంభించబోతున్నట్టు బ్యాంకు ఎండీ తెలిపారు. దీంతో ఆఫీసర్లు, ఇతర కేడర్లలో కొత్తగా 3,000 మంది ఉద్యోగులను కూడా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిక్రూట్ చేసుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా తమ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.8 నుంచి 2.9 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు.
Read Also: Stock Markets Wednesday Closing: యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం జంకని భారత స్టాక్ మార్కెట్లు