Share News

2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్‌

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:25 AM

వచ్చే 22 ఏళ్లలో (2047 నాటికి) భారత్‌ అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరించనుందని, జీడీపీ 23-35 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందని బెయిన్‌ అండ్‌ కో, నాస్కామ్‌ సంయుక్తంగా గురువారం విడుదల...

2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్‌

  • 23-35 లక్షల కోట్ల డాలర్లకు దేశ జీడీపీ

  • సేవల రంగమే వృద్ధికి ప్రధాన చోదకం

  • బెయిన్‌ అండ్‌ కో-నాస్కామ్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే 22 ఏళ్లలో (2047 నాటికి) భారత్‌ అధిక ఆదాయం కలిగిన దేశంగా అవతరించనుందని, జీడీపీ 23-35 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందని బెయిన్‌ అండ్‌ కో, నాస్కామ్‌ సంయుక్తంగా గురువారం విడుదల చేసిన నివేదిక అంచనా వేసింది. భారత సేవల రంగమే వృద్ధికి ప్రధాన చోదకం కానుందని నివేదికలో పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • 2047 నాటికి భారత జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతానికి పెరగనుంది. మాన్యుఫాక్చరింగ్‌ రంగం 32 శాతం వాటా కలిగి ఉండనుంది. ఈ రెండూ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి.

  • మున్ముందు దశాబ్దాల్లో దాదాపు 20 కోట్ల ఉద్యోగాల కల్పన జరగవచ్చు. అధికాదాయం పంచే ఆధునిక ఉద్యోగాల కల్పన ద్వారా ఆర్థికంగా బలపడే వినూత్న అవకాశం భారత్‌ కలిగి ఉంది. రంగాల వారీగా సాంకేతిక పురోగతి ప్రణాళికలు ఈ పరివర్తనంలో కీలక పాత్ర పోషించగలవు.


  • కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చిప్‌ డిజైన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌లో పూర్తి స్థాయి యాంత్రీకరణ, విడిభాగాల తయారీ, డిజైన్‌తో తిరోగమన అనుసంధానం ద్వారా ధరలో పోటీ సామర్థ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని పెంచనుంది. దాంతో ఆ రంగ ఎగుమతి వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45-50శాతానికి పెంచుకునే వీలుంటుంది. అలాగే, జీడీపీలో ఈ రంగం వాటా 3 శాతం నుంచి 8-10 శాతానికి చేరుకోవచ్చు.

  • 2023 నాటికి దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన రంగం వాటా 24 శాతంగా ఉండగా.. 2047 నాటికి 70 శాతానికి చేరుకోవచ్చు.

  • ఐసీఈ మార్కెట్లో వాటా పెంచుకోవడంతో పాటు ఈవీలకు మారడం ద్వారా వాహన విడిభాగాల ఎగుమతుల రంగం 2047 నాటికి 20,000-25,000 కోట్ల స్థాయికి చేరుకోవచ్చు. ఎలకా్ట్రనిక్స్‌, ఎనర్జీ, రసాయనాలు, ఆటోమోటివ్‌వ్‌, సర్వీసెస్‌ రంగాలు వ్యూహాత్మక వృద్ధి చోదకాలుగా పనిచేయనున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, నిపుణులతో పాటు మెరుగవుతున్న మౌలిక వసతులు ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నాయి.


  • భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లున్నాయి. 2030 నాటికి నిపుణుల కొరత 5 కోట్లకు పెరగవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌ (ఎ్‌సటీఈఎం) విద్యను మరింత మెరుగుపరచడంతో పాటు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా తయారీ సహా కీలక విడిభాగాల ఉత్పత్తి, డిజైనింగ్‌కు మరింత ప్రాధాన్యమివ్వాలి. తద్వారా విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారం తగ్గుతుంది.

  • ఏఐలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం, హరిత ఇంధనం, ఇతర కీలక రంగాలు, ఆర్‌ అండ్‌ డీలో పెట్టుబడుల పెంపు దేశీయంగా ఆవిష్కరణలకు దోహదపడటంతో పాటు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ఆధారపడటాన్ని తగ్గించుకోగలుగుతాం.

  • మౌలిక వసతుల పెంపు, నైపుణ్య కొరతను తగ్గించుకోవడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సాంకేతికత ద్వారా ఆవిష్కరణలను వేగవంతం చేయడంపైనే భారత ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంది.

  • డిజిటల్‌, రవాణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, దేశీయంగా తయారీ పెంపు, భాగస్వామ్యాల ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా భవిష్యత్‌ టెక్నాలజీలు, ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టవచ్చని నాస్కామ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంగీత గుప్తా అన్నారు. బహుముఖ, సాంకేతిక విధానం ద్వారా సమ్మిళిత, సుస్థిర వృద్ధికి బాటలు వేయవచ్చన్నారు.


ఇవి కూడా చదవండి:

Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 21 , 2025 | 04:25 AM