Share News

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:52 AM

పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులకు నిన్న మొన్నటి వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) మంచి పెట్టుబడి సాధనం. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఈ బాండ్స్‌ జారీకి ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

- బంగారంలో పెట్టుబడులకు ప్రత్యామ్నాయాలివే..

పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులకు నిన్న మొన్నటి వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) మంచి పెట్టుబడి సాధనం. అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ఈ బాండ్స్‌ జారీకి ప్రభుత్వం ఫుల్‌స్టాప్‌ పెట్టింది. మరి ఇప్పుడు డిజిటల్‌ ఫార్మాట్‌లో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరుల ముందు ఉన్న మార్గాలు ఏమిటి? అయితే ఇది మీ కోసమే..


బంగారానికి, మన సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. వీసమెత్తు బంగారమైనా లేకుండా మన దేశంలో ఏ ఇంట్లో, ఏ శుభకార్యం జరగదంటే అతిశయోక్తి కాదు. అటు స్టేటస్‌ సింబల్‌గానే గాక, పెట్టుబడి సాధనంగానూ మన దేశంలో పసిడికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల పొదుపులో కొంత మొత్తాన్ని అయినా డిజిటల్‌ గోల్డ్‌ వైపు మళ్లించే ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) పథకం తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఈ పథకం కింద 67 విడతలుగా 14.7 కోట్ల యూనిట్ల ఎస్‌జీబీలను ప్రభుత్వం జారీ చేసింది.


పసిడి పైపై చూపులు

అయితే మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఎస్‌జీబీ పథకానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. దీంతో డిజిటల్‌ ఫార్మాట్‌లో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులకు ఒక మార్గం మూసుకుపోయింది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి బంగారం 2,900 డాలర్లకు అటుఇటూగా ఉంది. దేశీయ మార్కెట్‌లోనూ 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం రూ.86,000-88,000 మధ్య తచ్చాడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం, అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడి లాభాల కోసం డిజిటల్‌ ఫార్మాట్‌లో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులు ఈ కింది మార్గాలను అన్వేషించవచ్చు.

ccc.jpg


లిస్టెడ్‌ ఎస్‌జీబీలు

ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన ఎస్‌జీబీలన్నీ బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్టయ్యాయి. డీమ్యాట్‌ ఖాతా ఉన్న రిటైల్‌ మదుపరులు ఎవరైనా ఈ రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీల క్యాష్‌ సెగ్మెంట్‌లో ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉండే ఈ ఎస్‌జీబీల యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే వీటికి ఐదేళ్ల లాక్‌-ఇన్‌-పీరియడ్‌ ఉంటుంది. ఐదు, ఆరు, ఏడేళ్ల చివర్లో ఆర్‌బీఐ ఈ బాండ్స్‌కు బైబ్యాక్‌ సదుపాయం కల్పిస్తోంది.


గోల్డ్‌ ఈటీఎఫ్‏లు

డిజిటల్‌ రూపంలో పసిడిలో మదుపు చేయాలనుకునే మదుపరులు మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) అందించే గోల్డ్‌ ఈటీఎ్‌ఫల్లోనూ మదుపు చేయవచ్చు. ఒక్కో గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. ఈ పథకాల ద్వారా సమీకరించిన నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఫిజికల్‌ గోల్డ్‌లో పెట్టుబడులుగా పెడతాయి. ప్రతి ట్రేడింగ్‌ డే చివర్లో ఆ రోజు బంగారం మార్కెట్‌ ధర ప్రకారం ఈ యూనిట్ల నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ) ప్రకటిస్తారు. ఈ ఈటీఎ్‌ఫలు కూడా లిస్టయి ఉంటాయి, కాబట్టి డీమ్యాట్‌ ఖాతా ఉన్న మదుపరులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని అమ్ముకోవచ్చు. లేదా కొనుగోలు చేయవచ్చు. నగలు లేదా ఫిజికల్‌ గోల్డ్‌ మేకింగ్‌ చార్జీలతో పోలిస్తే వీటి బ్రోకరేజీ చార్జీలూ తక్కువే. గోల్డ్‌ ఎంఎ్‌ఫలతో పోలిస్తే ఖర్చులూ తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఈ ఈటీఎ్‌ఫలను అమ్మాలన్నా, కొనాలన్నా ఎగ్జిట్‌, ఎంట్రీ లోడ్‌లు ఉంటాయి.

Updated Date - Feb 16 , 2025 | 11:53 AM