Gold and Silver Prices Hit Record: రేసు గుర్రాలు పసిడి, వెండి
ABN , Publish Date - Dec 27 , 2025 | 02:27 AM
జాతీయ, అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ధరలు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్క రోజే రూ.9,350 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి...
ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు
కిలో వెండి ధర ఒక్క రోజే రూ.9,350 అప్
10 గ్రాముల పుత్తడి ధర రూ.1,42,300
న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ విపణిలో బంగారం, వెండి ధరలు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్క రోజే రూ.9,350 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.2,36,350కి చేరింది. పారిశ్రామిక వినియోగం గణనీయంగా పెరగడం, ఉత్పత్తి తగినంతగా లేకపోవడం వల్ల వెండి ధర అడ్డూ, ఆపూ లేకుండా దూసుకుపోతోందని పరిశీలకులంటున్నారు. కాగా 10 గ్రాముల మేలిమి (24 కేరట్లు) బంగారంధర సైతం శుక్రవారం రూ.1,500 పెరిగి మరో కొత్త రికార్డు రూ.1,42,300కి చేరింది.
అంతర్జాతీయంగానూ అదే దూకుడు: అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో నూ బంగారం, వెండి ధరలు శుక్రవారం మరో ఆల్టైమ్ రికార్డును తాకాయి. ఔన్స్ (31.10 గ్రాములు) వెండి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 5.18ు లాభపడి 75.63 డాలర్ల రికార్డుకు చేరింది. అలాగే ఔన్స్ పసిడి ధర 50.87 డాలర్లు పెరిగి 4,530.42 డాలర్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ఈ రెండు విలువైన మెటల్స్ ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెలివరీ ఇచ్చే ఔన్స్ పసిడి ధర శుక్రవారం 4,542.05కు చేరింది.
బంపర్ లాభాలు: ఈ ఏడాది బంగారం, వెండి అందించినంత భారీ స్థాయి లో మరే ఇతర పెట్టుబడులు మదుపరులకు లాభాలు పంచలేదు. 10 గ్రాముల మేలిమి పసిడి ధర గత ఏడాది డిసెంబరు 31న రూ.78,950, కిలో వెండి ధర రూ.89,700 పలికింది. శుక్రవారం నాటి ధరలతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర రూ.63,350 (అంటే 80.24%), కిలో వెండి ధర రూ.1,46,650 (అంటే 163.5%) పెరిగి మదుపరులకు బంపర్ లాభాలు పంచాయి. ఈ నెల 19 నుంచి చూసినా కిలో వెండి ధర రూ.32,250 (15.8%) పెరిగింది.
వచ్చే ఏడాదీ ఇదే జోరు
వచ్చే ఏడాది కూడా ఈ రెండు లోహాల పరుగుకు బ్రేక్ పడకపోవచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ఔన్స్ వెండి ధర వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో 100 డాలర్లకు చేరడం పెద్ద కష్టంగాకపోవచ్చని అంచనా. భారత మార్కెట్లోనూ వచ్చే ఏడాది ఈ రెండు లోహాల ధర ఎంతలేదన్నా కనీసం మరో 20ు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ర్యాలీకి కారణాలు
అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయనే అంచనాలు.
డాలర్తో క్షీణిస్తున్న రూపాయి మారకం రేటు.
ఆరు ప్రధాన కరెన్సీలతో కొనసాగుతున్న డాలర్ మారకం రేటు పతనం.
కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు.
సురక్షిత పెట్టుబడిగా ఈ రెండో లోహాలకు ఉన్న పేరు.
కేంద్ర బ్యాంకులు బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం.
డిమాండ్కు తగ్గట్టుగా లేని ఉత్పత్తి.
ఈవీలు, ఎలకా్ట్రనిక్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెరుగుతున్న వెండి వినియోగం.
Also Read:
Robbers Kick Man Off: సినిమా లెవెల్లో హైవేపై చోరీ.. పక్కా ప్లాన్తో రూ. 85 లక్షలు దోచేశారు
CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
Nara Bhuvaneswari: విద్యార్థులు దేశాన్ని లీడ్ చేయాలి