FDI : బీమాలోకి 100% ఎఫ్డీఐ
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:51 AM
దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్ఫడీఐ) పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పాలసీదారుల నుంచి వసూలు చేసే ప్రీమియం మొత్తాన్ని
అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రవేశానికి గేట్లు బార్లా
పెట్టుబడులతో పాటు సేవల వ్యాప్తి పెరిగేందుకు అవకాశం
కంపెనీల మధ్య పోటీ పెరిగి పాలసీల ప్రీమియం తగ్గే చాన్స్
న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్ఫడీఐ) పరిమితిని ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పాలసీదారుల నుంచి వసూలు చేసే ప్రీమియం మొత్తాన్ని భారత్లోనే పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఈ పరిమితి పెంపు అందుబాటులో ఉంటుందని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన రక్షణ కవచాలు, షరతులను సమీక్షించి, సరళీకరించడం జరుగుతుందన్నారు. ఎఫ్డీఐ పరిమితి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం బీమా చట్టం 1938, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1956, బీమా నియంత్రణ, అభివృద్ధి అధికార సంస్థ చట్టం 1999లో తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది. బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. 2021లో 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. అంతేకాదు, బీమా ఇంటర్మీడియేటరీ సంస్థల్లో ఎఫ్డీఐ పరిమితిని కేంద్రం ఇప్పటికే 100 శాతానికి పెంచింది.
ప్రపంచ బీమా దిగ్గజాలకు రాచబాట
దేశీయ బీమా రంగంలోకి మరిన్ని పెట్టుబడులు రావడంతో పాటు అంతర్జాతీయ బీమా దిగ్గజాలన్నీ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు, వినూత్న పథకాలు అందుబాటులోకి వచ్చేందుకు ఈ పరిమితి పెంపు వీలు కల్పించనుంది.
ప్రపంచంలోని టాప్-25 బీమా కంపెనీల్లో ప్రస్తుతం 5 మాత్రమే దేశీయ భాగస్వాములతో కలిసి భారత్లో సేవలందిస్తున్నాయి. కేంద్రం తాజా నిర్ణయంతో మిగతా బడా కంపెనీలూ భారత్ బాట పట్టే అవకాశం ఉంది. భారత భాగస్వాములతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రస్తుత జాయింట్ వెంచర్ నుంచి పూర్తిగా వైదొలిగి సొంత కుంపటి పెట్టుకోవడం లేదా జాయింట్ వెంచర్లోని దేశీయ భాగస్వామి వాటానూ కొనుగోలు చేసే అవకాశాలు పెరగనున్నాయి.
వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో 1,000 బీమా కంపెనీలు!
ఎఫ్డీఐ పెంపుతో ఎఫ్డీఐ పరిమితి పెంపుతో వచ్చే దశాబ్దకాలంలో బీమా సంస్థల సంఖ్య 1,000కి చేరుకోవచ్చని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ తపన్ సింఘేల్ అభిప్రాయపడ్డారు. దేశంలో బీమా సేవలు మరింతగా వ్యాప్తి చెందడంతో పాటు కంపెనీల మధ్య పోటీ పెరిగి పాలసీల ప్రీమియం తగ్గేందుకు, సేవలు మరింత మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాదు, బీమా కంపెనీలు ఆయా ఆదాయ వర్గాలు, ప్రాంతాల వారీ అవసరాలకు అనుగుణమైన పాలసీలు ప్రవేశపెట్టేందుకు ఇది బాటలు వేయనుందని, తద్వారా పాలసీదారులకూ అధిక ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి