Adani Group Ventures: పెట్రోకెమికల్స్ రంగంలోకి అదానీ
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:59 AM
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యానన్ని మరింత విస్తరిస్తోంది. కొత్తగా పెట్రో రసాయనాల (పెట్రో కెమికల్స్) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా...
గుజరాత్లో పీవీసీ ప్లాంట్
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యానన్ని మరింత విస్తరిస్తోంది. కొత్తగా పెట్రో రసాయనాల (పెట్రో కెమికల్స్) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్లోని ముంద్రా వద్ద ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న పోలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని అదానీ గ్రూప్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ్సకు గట్టి పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.
భారీ డిమాండ్
సింథటిక్ పాలిమర్ అయిన పీవీసీని అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో దీనికి ఏటా 40 లక్షల టన్నుల వరకు డిమాండ్ ఉంది. ఇందులో 15.9 లక్షల టన్నులు మాత్రమే దేశీయంగా ఉత్పిత్తి అవుతోంది. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 7.5 లక్షల టన్నులు. దేశంలో పీవీసీ డిమాండ్ ఏటా 8-10 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకే అదానీ గ్రూప్ పీవీసీ ఉత్పత్తిలోకి ప్రవేశిస్తోందని భావిస్తున్నారు.
మధ్యలో ఆటంకం
నిజానికి ఐదేళ్ల క్రితమే అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టు తలపెట్టింది. అయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో 2023 మార్చిలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టింది. పరిస్థితులు కుదుటపడడంతో మళ్లీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. డిమాండ్ను బట్టి ఈ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని 20 లక్షల టన్నులకు విస్తరించాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.1,000 కోట్ల ఎన్సీడీ ఇష్యూ
అహ్మదాబాద్: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) తమ రెండో సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) పబ్లిక్ ఇష్యూను ప్రకటించింది. ఈ ఇష్యూ వార్షికంగా 9.30 శాతం వరకు ఈల్డ్ను అందిస్తుంది. ఇష్యూ 2025 జూలై 9 (బుధవారం)న ప్రారంభమై, 2025 జూలై 22 (మంగళవారం)న ముగుస్తుంది.గతేడాది సెప్టెంబర్లో ఏఈఎల్ తొలి NCD ఇష్యూ తొలి రోజునే పూర్తిగా సబ్స్క్రైబ్ అయింది. అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగేశిందర్ రాబీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇష్యూ రిటైల్ ఇన్వెస్టర్లకు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం కల్పిస్తుంది. బేస్ ఇష్యూ పరిమాణం రూ.500 కోట్లు, ఓవర్ సబ్స్క్రిప్షన్ పక్షంలో రూ.500 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్తో మొత్తం రూ.1,000 కోట్ల వరకు ఉంటుంది. ఒక్కో NCD ముఖ విలువ రూ.1,000 కాగా, కనీసం 10 NCDలకు (రూ.10,000) దరఖాస్తు చేసుకోవాలి. సమీకరించిన నిధులలో కనీసం 75% రుణాల చెల్లింపునకు, మిగిలినది కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Read Latest Telangana News and National News